గంగాధరనెల్లూరు: జీడీ నెల్లూరు మండలం, రామానాయుడుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు బాబు మృతిపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలని రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుకు బాబు మృతి చెందాడని ఆరోపించారు. పలు అక్రమ కేసులు బనాయించి, బైండోవర్ పేరుతో రెవెన్యూ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ బాబును తిప్పి తీవ్రంగా వేధించారని చెప్పారు. కూటమి ప్రభుత్వ వేధింపులు తాళలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. దీనిపై నిజాయితీగా కేసుగట్టి, దోషులను శిక్షించాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
మరణ వాంగ్మూల లేఖ
బాబు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరణ వాంగ్మూల లేఖను నారాయణస్వామి మీడియాకు చూపారు. ఈ లేఖలో కూటమి ప్రభుత్వ వేధింపులు తళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్పష్టంగా ఉందని చెప్పారు. బాబు ఏడవ తరగతి వరకు చదువుకున్నాడని పేర్కొన్నారు. బాబు మృతి పట్ల ప్రత్యేక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.


