పూతలపట్టు(యాదమరి): తిరుమల యాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంటి వద్ద ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో కారులో బయలుదేరగా.. విధి ఆడిన వింత నాటకంలో ఏ కారులో అయితే ఉత్సాహంగా బయలుదేరారో అదే కారు వారి పాలిట మృత్యుశకటంగా మారుతుందని గ్రహించలేకపోయారు. మరో రెండు గంటల్లో తిరుమలకు చేరుకోనుండగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెలుతున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు దంపతులు సహా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం పి. కొత్తకోటలో చోటు చేసుకుంది. పూతలపట్టు పోలీసుల వివరాలు మేరకు.. కర్ణాటక రాష్ట్రం మాండ్య ప్రాంతానికి చెందిన సతీష్ (50) తన కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనార్థం కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పూతలపట్టు మండల పరిధి పి.కొత్తకోట సమీపంలో స్వయంగా కారు నడుపుతున్న సతీష్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ముందు వెలుతున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంలో కూర్చున్న సతీష్, భార్య భాగ్యలక్ష్మి(45) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న శశాంక్, పవని, మహాలక్ష్మి, తుషారకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో సమీప పి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన సతీష్, క్షతగాత్రులను అంబులెన్సులో
తరలిస్తున్న పోలీసులు


