ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడుల మధ్య పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ఇరాన్ తాజాగా మరో సంచలన హెచ్చరిక జారీ చేసింది. తన ద్వీపాలపై దాడులు జరిగిగే మరో జలసంధిని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటామని తాజాగా ప్రకటించింది. ఇరాన్ గనుక కాల్పుల విరమణ షరతులకు అంగీకరించకపోతే, సైనిక చర్యను మరింత తీవ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ తాజా హెచ్చరిక జారీ చేసింది.
శత్రువు పీచమణచాలంటే.. బాబ్ అల్-మందబ్ జలసంధిపై పట్టు
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ దక్షిణ ద్వీపాలపై భూతల దాడులు జరిగితే, యెమెన్కు చెందిన సాయుధ రాజకీయ, మత సమూహమైన అన్సరుల్లా (హౌతీలు) బాబ్ అల్-మండబ్ (Bab al-Mandab)జలసంధిని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టెహ్రాన్ హెచ్చరించింది.
దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ ప్రతిఘటనా (Resistance) విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నమ్మకమైన హామీలు లేకుండా చర్చలకు లేదా కాల్పుల విరమణకు తావులేదని ఆయన తేల్చి చెప్పారు. అలాగే ఇరాన్ భూభాగంలోకి చొరబడి దాడులు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) హెచ్చరించింది. ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్పై దాడితో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అన్సరుల్లా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, శత్రువును దారికి తీసుకురావడానికి ఈ కీలక సముద్ర మార్గాన్ని మూసివేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ మీడియా సంస్థ 'తస్నిమ్' పేర్కొంది.శత్రువుకు మరింత గుణపాఠం నేర్పడానికి ఈ జలసంధిని నియంత్రించడం అవసరమని భావిస్తోంది. ఈ జలమార్గంలో "విశ్వసనీయమైన ముప్పు"ను సృష్టించే సామర్థ్యం ఇరాన్కు ఉండటమే కాకుండా, అన్సరుల్లా "వీరోచిత శక్తులు" కూడా "నైపుణ్యంతో కూడిన పాత్ర పోషించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి" అని తస్నిమ్ తెలిపింది.
ఇదీ చదవండి: కోట్లాది మందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు
కాగా ఇప్పటికే ఇజ్రాయెల్కు వెళ్లే లేదా అక్కడి నుండి వచ్చే నౌకలపై హుతీలు దాడులు చేస్తూ ఆర్థికంగా ఇజ్రాయెల్ను దెబ్బతీస్తున్నారు. దీనివల్ల నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. నౌకలపైనే కాకుండా, అమెరికా యుద్ధ నౌకల పైన మరియు ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాల పైన హుతీలు వైమానిక దాడులు చేస్తున్నారు.రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మధ్య ఉన్న బాబ్ అల్-మండబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం.
ఇదీ చదవండి: రూ. 5 కోట్ల దోపిడీ : దొంగబాబా 21 ఫారిన్ ట్రిప్స్, బెంజ్కారు!


