ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీయించాలి!! | Experts Call for Policy Shifts to Turn Household Gold into Financial Assets | Sakshi
Sakshi News home page

ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీయించాలి!!

Mar 25 2026 7:45 PM | Updated on Mar 25 2026 8:38 PM

Experts Call for Policy Shifts to Turn Household Gold into Financial Assets

దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న భారీ బంగారు నిల్వలను ఆర్థిక సాధనాలుగా (Financial Assets) మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు పి.పి. చౌదరి పేర్కొన్నారు. అసోచామ్ (ASSOCHAM) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బంగారం 'ఆర్థికీకరణ' (Financialization) ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, తద్వారా కరెంట్ ఖాతా లోటు (CAD)పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర
రత్నాలు, ఆభరణాల రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉందని చౌదరి గుర్తుచేశారు. దేశ మొత్తం సరుకుల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 15 శాతం ఉందన్నారు. దాదాపు 50 లక్షల మందికిపైగా ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు.

50 వేల టన్నుల బంగారం నిల్వలు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ, భారతీయ ఇళ్లు, దేవాలయాల్లో కలిపి సుమారు 25,000 నుండి 50,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా అని తెలిపారు. "మన దగ్గర పటిష్టమైన ప్లాట్‌ఫాం, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుల (EGR) వినియోగాన్ని పెంచడానికి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

అడ్డంకిగా 3% జీఎస్టీ
భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, షేర్ల మాదిరిగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేసేందుకు ఈజీఆర్‌ విధానాన్ని సెబీ (SEBI) అందుబాటులోకి తెచ్చింది. అయితే, బంగారాన్ని సరెండర్ చేసే సమయంలో విధిస్తున్న 3 శాతం జీఎస్టీ (GST) దీని విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని కృష్ణన్ వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక శ్వేతపత్రాన్ని సమర్పించిందని వెల్లడించారు.

పెరుగుతున్న డిమాండ్.. పుంజుకుంటున్న గోల్డ్ లోన్స్
గత రెండేళ్లలో బంగారం ధరలు 30 శాతం పెరిగినప్పటికీ, ఆభరణాలకు డిమాండ్ తగ్గలేదని ఇక్రా (ICRA) ప్రతినిధి జితిన్ మక్కర్ తెలిపారు. ప్రధాన జ్యువెలరీ రిటైలర్లు 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో తమ స్టోర్ నెట్ వర్క్ ను 20 శాతం మేర పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో గతంలో రూ. 1 లక్ష కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 4 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.

తప్పనిసరి హాల్‌మార్కింగ్, 'ఇండియన్ గుడ్ డెలివరీ స్టాండర్డ్స్' వంటి నిబంధనలు దేశీయ బంగారంపై నమ్మకాన్ని పెంచాయని, ఇది దిగుమతుల నియంత్రణకు దోహదపడుతుందని నిపుణులు విశ్లేషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement