విద్యార్థులూ... వీటిపై దృష్టి సారించండి!
తిరుపతి సిటీ: ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి జరగనున్నాయి. పరీక్షల్లో విద్యార్థుల భవితవ్యాన్ని నిర్దేశించే కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ప్రశ్నపత్రం చేతికి అందిన వెంటనే తక్కువ సమయంలో పూర్తిగా చదవాలి. తొలుత పూర్తి స్థాయిలో సమాధానం తెలిసిన ప్రశ్నలను ఎంచుకుని సమాధానం ఇవ్వాలి. జవాబు పత్రంలో చక్కటి చేతిరాతతో అక్షరాలు స్పష్టంగా మూల్యాంకనం చేసే ఇన్విజిలేటర్కు అర్థమయ్యేలా రాయాలి. కొట్టివేతలకు తావివ్యకూడదు. పేజీలో నింపే ప్రయత్నం చేయకుండా అడిగిన ప్రశ్నలకు సూటిగా క్లుప్తంగా సమాధానం ఇవ్వాలి. పదాలు, వాక్యాల మధ్య తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక పేజీలో 16 నుంచి 18 వరుసలు మించకుండా రాయాలి. బ్లూ బాల్ పెన్లు తప్ప వేరే వాడకూడదు. ప్రధానాంశాలకు కలర్ స్కెచ్పెన్లతోనూ, కలర్ పెన్సిళ్లతో అడ్డదిడ్డంగా గీతలు గీయకూడదు. అతి ముఖ్యమైన పాయింట్లు ఉంటే మాత్రమే పెన్సిల్తో మార్కు చేయాలి. పేజీలో పైభాగంలో ఒక అంగుళం, కుడి, ఎడమ వైపున మార్జిన్ వదిలి సమాధానాలు రాయాలి. వీటిని పాటిస్తే పరీక్ష ఏదైనా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.


