భక్తజనతేరు!
వైభవంగా రథోత్సవం
బంగారుపాళెం: మొగిలి మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొగిలి శైవ క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీకామాక్షీ సమేత మొగిలీశ్వరస్వామి వారి దివ్య రథోత్సవాన్ని గురు వారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సాయంత్రం రథానికి పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను అలంకార మండపం నుంచి తీసుకువచ్చి రథంపై కొలువు దీర్చారు. సతీసమేతుడైన శ్రీమొగిలీశ్వరస్వామి బ్రహ్మరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో మొగిలి శివాలయానికి చేరుకున్నారు. రథంపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు చెల్లించుకున్నారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రథోత్సవానికి బెంగళూరు ఆక్స్ఫర్డ్ డెంటల్ కళాశాల యజమాని లేట్ నరసరాజు కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పలపనేరు డీఎస్పీ ప్రభాకర్ పర్యవేక్షణలో బంగారుపాళెం సీఐ శ్రీని వాసులు పోలీస్ బందోబస్తు చేపట్టారు. ఆలయ ఈఓ మునిరా పాల్గొన్నారు.
నేడు పుష్పపల్లకీ సేవ
మొగిలి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీమొగిలీశ్వర స్వామి, కామాక్షమ్మ వారికి పుష్పపల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.


