నిరుద్యోగ హామీ నెరవేర్చాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రీజనల్ కో–ఆర్డినేటర్ హేమంత్రెడ్డి డిమాండ్ చేశా రు. ఈ మేరకు ఆ విభాగం నాయకులు బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు మరో సారి నిరుద్యోగ యువతను ముంచేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ముచ్చటగా మూడో సారి బడ్జెట్లోనూ నిరుద్యోగులకు మొండి చేయి చూపించిందని దుయ్యపట్టారు.
ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేలు బకాయి
ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికీ రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఇచ్చారని, రెండేళ్ల పాలనలో ఒక్కో నిరుద్యోగికి ఏడాదికి రూ.36 వేల చొప్పున రూ.72 వేలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇలా 20 లక్షల మందికి దాదాపు రూ.14,400 కోట్ల వరకు బకాయిపడిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో అసలు నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదన్నారు.
మోసం బాబూ!
చిత్తూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు డీసీ.మనోజ్రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల ప్రచారంలో రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. నాలుగున్నరేళ్లకు పైగా ఆ ఊసే ఎత్తలేదని దుయ్యబట్టారు. 2018 బడ్జెట్లో 500 కోట్ల రూపాయిలు ప్రకటించినా.. పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను తొలుత 12 లక్షలు అని చెప్పినా,చివరికి 2.10 లక్షల మందే అర్హులు అని మోసం చేశారని గుర్తుచేశారు. దాదాపు 21 నోటిఫికేషన్లను షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2024 డిసెంబర్కు నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టలేదని విమర్శించారు. వెంటనే నిరుద్యోగ భృతిని చెల్లించాలని లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. యువజన విభాగం నాయకులు భాను, శబరీష్, ప్రవీణ్, అఖిలేష్, రాజు, దినేష్, జయంత్ పాల్గొన్నారు.


