యూరియా.. ఏదయా!
గుడిపాల: యూరియా దొరక్క అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారు. మండలంలో చిత్తపార, బండపల్లె, పాపసముద్రం, అడవిచేను, చింతగుంటూరు, బొమ్మసముద్రం, 197రామాపురం, చీలాపల్లె, నారగల్లు తదితర గ్రామాల్లో వరిసాగు ప్రారంభమైంది. ప్రస్తుతం 150 హెక్టార్లపైనే వరినాట్లు వేశారు. గ్రామాల్లోని రైతుసేవా కేంద్రాల్లో యూరియా దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. మండలంలో 17 రైతుసేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడా కూడా యూరియా లభించలేదు. ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా ఉన్నప్పటికీ వారు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూరియా అధిక ధరలకు విక్రయించడం లేదా జింక్, గుళికలు, డీఏపీ తీసుకున్న వారికే యూరియా ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. బస్తా యూరియా ధర రూ.267కు విక్రయించాల్సి ఉండగా.. రూ.400 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. కొంత మంది రైతులు తమిళనాడులోని కాట్పాడి, వేలూరుకు వెళ్లి యూరియా తీసుకొచ్చుకోవాల్సి వస్తోంది. దీనిపై గుడిపాల వ్యవసాయాధికారిణి సంగీతను వివరణ కోరగా.. మండలంలోని పది రైతు సేవా కేంద్రాలకు ఇండెంట్ పెట్టామన్నారు. ఒక్కో కేంద్రానికి 150 బస్తాల యూరియా వస్తుందని చెప్పారు.


