చౌక దుకాణాల్లో కంది పుప్పు పంపిణీకి బ్రేకులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 14 ఎంఎల్ఎస్ పాయింట్ల కింద 1,349 రేషన్దుకాణాలున్నా యి. వీటికి ప్రతినెలా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 9వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం, 265 టన్నుల చక్కెర పంపిణీ చేస్తున్నారు. అక్కడక్కడ గోధుమ పిండి సరఫరా చేస్తున్నారు. అయితే కంది పప్పు పంపిణీకి పూర్తిగా స్వస్తి పలికారు. పప్పన్నం లేక ఊరుబిండి.. పచ్చళ్లతో లబ్ధిదారులు సర్దుకుపోతున్నారు.
బియ్యం మాత్రమే
ప్రతి నెలా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత బియ్యం మాత్రమే అందజేస్తున్నారు. ఎన్నికల్లో రేషన్ డిపోల ద్వారా అన్ని రకాల పప్పులు రాయితీ ధరలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెలా ఇచ్చే సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించడం లేదని పేదలు పెదవి విరుస్తున్నారు. వరుసగా నాలుగు నెలలుగా బియ్యం, చక్కెర తప్ప మిగిలిన సరుకులు ఇవ్వడం లేదు.
కంది పప్పు కష్టం
రేషన్ షాపుల్లో కంది పప్పు, చక్కెర మాత్ర మే ఇస్తున్నారు. ఇతరాత్ర సరుకులు ఇవ్వ డం లేదు. కనీసం కంది పప్పు అయినా ఇస్తే మేలు. బయట కంది పప్పు కేజీ రూ.160 అంటున్నారు. అందులో కూడా క్వాలిటీ చూసి ధరలు ఉంటున్నాయి. నాసిరకమంటే రూ.120 నుంచి రూ.130కి అమ్ముతున్నా రు. మంచివి కేజీ రూ.160కి పైమాటే. ప్రభుత్వం స్పందించి రేషన్ షాపుల్లో కందిపపు ఇచ్చేలా చూడాలి. – మాధవి, చిత్తూరు
కందిపప్పు ఇవ్వరు
చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టాక నిత్యావసర సరుకులకు రెక్కలొచ్చాయి. అమాంతం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కంది పప్పు ధర పెరిగిపోయింది. పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే కంది పప్పును వినియోగించుకుందామని తెల్లరేషన్ కార్డుదారులు ఆలోచిస్తుంటే.. ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. గత ఏడాది కొద్ది మందికి నామమాత్రంగా కంది పప్పు పంపిణీ చేశారు. ఫిబ్రవరిలో బియ్యంతో పాటు మరికొంత మందికి పంచదార పంపిణీ చేసి సరిపెట్టేశారు. ఆ తర్వాత కంది పప్పు సరఫరా చేయకపోవడంతో తెల్ల కార్డుదారులు తెల్లబోయారు. బయట మార్కెట్లో కిలో కందిపప్ప రూ.150 నుంచి రూ.160 వరకు ధర ఉండగా గత ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనం ద్వారా కిలో రూ.67కి పంపిణీ చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలలు మాత్రమే ఎండీయూ వాహనాల ద్వారా అరకొరగా కందిపప్పు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు.


