పనితీరు మార్చుకోవాల్సిందే
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాల ల్లోని హెచ్ఎంలు పనితీరు మార్చుకోకపోతే వేటు ఖాయమని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన తాగునీరు అందించాలన్నా రు. ఇందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించిన నిధులను మార్చి 31వ తేదీలోపు ఖర్చు చేయాలన్నారు.
ఫలితాలు రాకుంటే కఠిన చర్యలు
ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకే రకమైన పాఠ్య పుస్తకాలు, బోధనా పద్ధతులు ఉన్నప్పటికీ ఫలితాల్లో తేడాలు వస్తే దానికి ప్రధాన బాధ్యత హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులదేనని కలెక్టర్ తేల్చి చెప్పారు. పనితీరు మెరుగుపరుచుకోని హెడ్ మాస్టర్లను అవసరమైతే వెంటనే మార్చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థులను దత్తత తీసుకుని పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. 9వ తరగతి నుంచే సైనన్స్, గణితం, ఆంగ్లం, హిందీ భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. విద్యార్థుల హాజరుపై ఎంపీడీవోలు, తహసీల్దార్లతో కలిసి సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో రాజేంద్రప్రసాద్, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.


