పలమనేరులో రూ.13 కోట్లకు ఐపీ
పలమనేరు: పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఓ వ్యాపారి రూ.13 కోట్లకు కోర్టులో ఐపీ దాఖలు చేసినట్టు తెలిసింది. ఇది నెంబరు కూడా అయినట్టు సమాచారం. ఇందులో 71 మంది నుంచి తాను తీసుకున్న డబ్బును కట్టలేనని ఐపీ పిటిషనర్ విన్నవించినట్టు సమాచారం. ఇదే వ్యాపారి చీటీల వ్యవహారంలో భారీగా నష్టపోయి ఐపీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని శ్రీసాక్షిశ్రీ గతంలోనే చెప్పింది. త్వరలో మరో ఐపీ బాంబు శీర్షికన గత జనవరిలో కథనం కూడా వెలువడింది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక కోర్టులో పిటిషనర్ తాను డబ్బులు కట్టలేనని తన న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. ఆర్థికంగా నష్టాలపాలైన పిటిషనర్ తాను ముందుగానే ఐపీ దాఖలు చేయాలనే ప్లాన్తో తన ఆస్తులను సైతం దూరపు బంధువులకు ముందుగానే రాసిచ్చినట్టు తెలుస్తోంది.
వరసిద్ధుడి సేవలో విదేశీ భక్తులు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానాన్ని బుధవారం వివిధ దేశాలకు చెందిన విదేశీ భక్తులు దర్శించుకున్నారు. జర్మనీ దేశానికి చెందిన శ్రీ పీఠ నిలయ భక్తి మార్గ్ సెంటర్ అధినేత పరమహంస విశ్వనాథ గురూజీ ఆధ్వర్యంలో జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన సుమారు 170 మంది భక్తుల బృందం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా భక్తులకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల్ కిషోర్ పాల్గొన్నారు.


