వ్యక్తి అదృశ్యంపై కేసు
యాదమరి: మండలంలో ఓ వ్యక్తి గత కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో ఎస్ఐ ఈశ్వర్ కేసు నమోదు చేశారు. వివరాలు.. మండల పరిధి కొటాలం దళితవాడకు చెందిన దినేష్ గత పది నెలలుగా భార్య, పిల్లలతో కలసి తిరుపతిలో నివసిస్తూ, రేణిగుంటలోని ఓ మొబైల్ కంపెనీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో దినేష్ అక్కడ పనిచేస్తున్న మరో వివాహితతో సన్నిహితంగా ఉండడంతో భార్య లావణ్య అనుమానం వ్యక్థం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 5న సొంత గ్రామమైన కొటాలంకు కుటుంబంతో కలసి వచ్చారు. అయితే అదే రోజు రాత్రి బయటకు వెళ్లిన దినేష్ తిరిగి ఇంటికి రాలేదు. అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులతో కలసి గాలించారు. కానీ ఆచూకీ లభించలేదు. ఈ మేరకు దినేష్ భార్య లావణ్య ఫిర్యాదు మేరకు ఈనెల 11న ఎస్ఐ ఈశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాధితురాలు జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దినేష్ ఆచూకీ తెలిసిన వారు 9440900684కు సంప్రదించాలని ఆయన కోరారు.


