
నవవధువు అనుమానాస్పద మృతి
● భార్య కుటుంబ సభ్యులపై భర్త అనుమానం ● కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
చిత్తూరు అర్బన్: నాలుగేళ్ల ప్రేమ. వివాహానికి పెద్దల నిరాకరణ. కులమతాలు వేరుకావడమే ప్రధాన సమస్య. పెద్దల్ని ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడే రెండు నైలెంది. నాన్న దిగులుగా ఉన్నాడు.. వచ్చి చూసి వెళ్లమని బతిమిలాడితే పుట్టింటికి వెళ్లింది. గంటలోపే శవమైంది. చిత్తూరు నగరంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై వాస్తవాలేమిటీ ఎవరికీ తెలియడంలేదు. ఈ ఘటనపై పోలీసులు అనుమానానస్పద మృతి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. టూటౌన్ పోలీసులు, మృతురాలి భర్త కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్అలీ మూడో కుమార్తె యాస్మిన్ (26) నగరంలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. బీటెక్ చదువుతుండగానే పూతలపట్టు మండలం పోటుకనుమ దళితవాడకు చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు వీళ్ల ప్రేమ ప్రయాణం కొనసాగింది. అయితే యాస్మిన్కు చిత్తూరు నగరానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పెళ్లి జరగాల్సి ఉండగా, 6వ తేదీన ఆమె సాయితేజతో వెళ్లిపోయి, అతడ్ని వివాహం చేసుకుంది. పెద్దల నుంచి ప్రాణహాని ఉండొచ్చని తిరుపతి పోలీసులను ఆశ్రయిస్తే, ఇరుపక్షాల కుటుంబ సభ్యుల్ని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పూతలపట్టులోనే సాయితేజ, యాసిన్ కాపురం పెట్టారు. ఇటీవల యాసిన్ తన అక్కలు, అమ్మతో తరచూ ఫోన్లో బాగానే మాట్లాడేది. యాసిన్ వెళ్లిపోయినప్పటి నుంచి తండ్రి దిగులుగా ఉన్నాయని, ఓ సారి వచ్చి చూసి వెళ్లాలని కుటుంబ సభ్యులు కోరారు. ఆదివారం సాయితేజ, యాసిన్ ఇద్దరూ కారులో చిత్తూరుకు వచ్చారు. యాసిన్ ఇంటి వద్దకు వెళ్లడానికి సాయితేజ భయపడి, పీసీఆర్ కూడలిలో యాసిన్ను దిగబెట్టి.. వాళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఓ కారులో వచ్చిన యాసిన్ కుటుంబ సభ్యులు, ఆమెను బాలాజీ కాలనీలోని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి రాగానే యాసిన్ తండ్రి షౌకత్ ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ మా పరువు మొత్తం తీశావు, ఇప్పుడెందుకు వచ్చావు..? వెళ్లిపో ఇక్కడి నుంచి..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనే బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపు తరువాత తలుపుతెరచి చూస్తే, యాసిన్ చున్నితో ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలిస్తే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా యాసిన్ మృతికి ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ సాయితేజ ఆరోపిస్తున్నాడు. దీనిపై టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా యాసిన్ బలవన్మరణానికి పాల్పడిందా..? కుటుంబ సభ్యులు ఏమైనా చేశారా..? అనే కోణాల్లో ద ర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు యాసిన్ను పీసీఆర్ కూడలి నుంచి ఇంటికి కారులో తీసుకెళ్లిన యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఇంటి నుంచి వెళ్లిన యశ్విన్ తండ్రి షౌకత్ అలీ ఆచూకీ తెలియ రాలేదు. దీంతో యశ్విన్ది హత్య..? ఆత్మహత్య..? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మృతురాలి మెడ వెనుక ఉన్న ఎముకను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. యువతి తనకు తానుగా ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా గొంతుకు చున్ని బిగించి చంపేశారా? అనే అంశంపై పోలీసులు కూడా ఎటు తేల్చుకోలేక పోతున్నారు.