
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ను గెలుచుకోవడంతో కర్ణాటకలో సందడి నెలకొంది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ ఈ విజయంతో సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుతో పాటు దేశం అంతటా ఈ సంబరాలు జోరుగా సాగుతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన ట్వీట్ ఈ వేడుకల్లో ఆసక్తిగా నిలిచింది.
భారత్లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశం విడిచి వెళ్లిపోయిన వ్యాపారవేత్త, ఆర్సీబీ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతోపాటు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆర్సీబీ జట్టును అభినందించిన మాల్యా ‘18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్స్ నిలిచింది. 2025 టోర్నమెంట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆర్సీబీకి అభినందనలు! ఈ సారి కప్పు మనదే’ అని ట్వీట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారింది. అందుకు అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.
RCB are IPL Champions finally after 18 years. Superb campaign right through the 2025 tournament. A well balanced team Playing Bold with outstanding coaching and support staff. Many congratulations ! Ee sala cup namde !!
— Vijay Mallya (@TheVijayMallya) June 3, 2025
‘దయచేసి ఈ శుభ సందర్భంగా కీర్తినగర్లోని ఎస్బీఐ బ్రాంచికి ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్లండి సర్..’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా మాల్యా ట్వీట్కు ఎస్బీఐ నుంచి వచ్చినట్లు ఉన్న రిప్లై (సర్, భారత్కు రండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం)ను జోడిస్తూ అందుకే ఎక్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు.
That’s why I like X pic.twitter.com/hR3QIEwJWV
— Harsh Goenka (@hvgoenka) June 4, 2025
ఇదీ చదవండి: మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రి
ఎస్బీఐ ట్వీట్ నిజమేనా?
వైరల్గా మారుతున్న మాల్యా ట్వీట్కు వస్తున్న రిప్లైలు ఆసక్తిగా మారుతున్న తరుణంలో ఎస్బీఐ నుంచి వచ్చిన రిప్లైను ధ్రువీకరించాలని ఏఐ అసిస్టెంట్ గ్రోక్ను ఓ యూజర్ కోరాడు. దానికి ప్రతిస్పందనగా ఇది కల్పితమై ఉండొచ్చని గ్రోక్ సూచించింది. ఏదేమైనా #EeSalaCupNamde అనే హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండ్ అయింది.