
సెన్సెక్స్ మైనస్.. నిఫ్టీ ప్లస్
ముంబై: ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 452 పాయింట్లు పతనమై సెన్సెక్స్ చివరికి 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 22,498 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 145 పాయింట్లు క్షీణించి 22,315 వద్ద కనిష్టాన్ని తాకింది. అమెరికా మాంద్యం భయాలతో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు భారీ క్షీణత(27%), ప్రైవేటు బ్యాంకులు, ఐటీ షేర్లలో తలెత్తిన అమ్మకాలతో నష్టాలు మరింత అధికమయ్యాయి. అయితే అఖరిగంటలో అధిక వెయిటేజీ ఐసీఐసీఐ బ్యాంకు(2.50%), రిలయన్స్ (1%), ఎయిర్టెల్ (2%) షేర్లు రాణించడంతో సూచీలు నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం ఆర్థిక మందగమనానికి దారితీయోచ్చనే ఆందోళనలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.