చెలరేగిన బుల్‌! | stock market increase | Sakshi
Sakshi News home page

చెలరేగిన బుల్‌!

Aug 17 2024 9:25 AM | Updated on Aug 17 2024 9:25 AM

stock market increase

ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ లాభాలు ఆర్జించాయి. అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 1,331 పాయింట్లు పెరిగి 80,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 397 పాయింట్లు లాభపడి 24,541 వద్ద నిలిచింది. ఈ ముగింపు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సూచీలు 2% ర్యాలీతో స్టాక్‌ మార్కెట్లో రూ.7.30 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.451.59 లక్షల కోట్ల(5.38 ట్రిలియన్‌ డాలర్లు) కు చేరింది.  
ఇంట్రాడే ట్రేడింగ్‌ ఇలా..! 
సెన్సెక్స్‌ ఉదయం 649 పాయింట్లు లాభంతో 79,755 వద్ద, నిఫ్టీ 191 పాయింట్లు పెరిగి 24,335 వద్ద మొదలైంది. రోజంతా లాభాల్లో కొన సాగాయి. ఐటీతో పాటు అన్ని రంగాల షేర్లూ రాణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,412 పాయింట్లు ర్యాలీ చేసి 80,518 వద్ద, నిఫ్టీ 295 పాయింట్లు పెరిగి 24,531 వద్ద గరిష్టాలు తాకాయి.

లాభాలు ఎందుకంటే  
 అమెరికా రిటైల్‌ అమ్మకాలు పెరగడం, నిరుద్యోగ క్లెయిమ్స్‌ డేటా తగ్గడంతో ఆర్థిక మాంద్యం భయాలు సన్నగిల్లాయి. అలాగే జూలై సీపీఐ ద్రవ్యోల్బణ డేటా అంచనాలకు తగ్గట్లు నమోదు కావడంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుపై అంచనాలు పెరిగాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 103 స్థాయి నుంచి 102.81 స్థాయికి దిగివచి్చంది. ఇటీవల భారీగా పతనమైన జపాన్‌ కరెన్సీ యెన్‌ స్థిరత్వాన్ని ప్రదర్శించింది. దీంతో యూఎస్‌ మార్కెట్లు గురువారం 2% ర్యాలీ చేశాయి. ఆసియా, యూరప్‌ మార్కెట్లు 3–1% చొప్పున లాభపడ్డాయి. అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల ధోరణి దేశీయ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చాయి. 
సెన్సెక్స్, నిఫ్టీ ఇటీవల తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాయి. ఆగస్టు నెలలో 2.5 శాతం దాకా నష్టపోయాయి. దీంతో కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్ల చేపట్టడం సూచీలకు కలిసొచి్చందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 బ్లూచిప్‌ షేర్లు టీసీఎస్‌ (3%), ఐసీఐసీఐ (2%), ఇన్ఫీ (2%), ఐటీసీ (2%) హెచ్‌డీఎఫ్‌సీ (1.50%), రిలయన్స్‌ (1%) రా ణించి ర్యాలీకి దన్నుగా నిలిచాయి.

బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ 3%, రియల్టీ 2.50%, ఆటో, కమోడిటీ, విద్యుత్, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సూచీలు రెండుశాతం చొప్పున రాణించాయి. స్మాల్, మిడ్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 2%, 1.75 శాతం రాణించాయి. 

సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లన్నీ లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. నిఫ్టీ సూచీలో 50 షేర్లలో దివీస్‌ ల్యాబ్స్‌ (0.50%), ఎస్‌బీఐ లైఫ్‌ (0.10%), డాక్టర్‌ రెడ్డీస్‌ (0.01%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 47 షేర్లూ లాభపడ్డాయి.  

ఎలక్ట్రిక్‌  బైక్స్‌లో 3 మోడళ్లను ఆవిష్కరించడంతో ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కంపెనీ షేరు 20% ర్యాలీ చేసి రూ.133 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement