రెండో రోజు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published
Thu, Mar 25 2021 5:19 PM
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిసాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, వైరస్ వ్యాప్తి నియంత్రణకు కర్ఫ్యూ విధిస్తుండడం, ఆర్థిక రికవరీ భయాలతో మదుపర్లు అమ్మకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. దాదాపు అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఉదయం 49,067 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 740.19 పాయింట్ల నష్టంతో 48,440.12 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 224.50 పాయింట్ల నష్టంతో 14,324.90 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 72.62గా ఉంది. నిఫ్టీలో మారుతీ సుజుకీ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ యూనిలీవర్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.