SEBI Carves Out Core Responsibilities For Mutual Fund Trustees - Sakshi
Sakshi News home page

భద్రతే లక్ష్యంగా.. మ్యూచువల్‌ ఫండ్స్‌లో సెబీ కొత్త మార్గదర్శకాలు

Jul 8 2023 7:04 AM | Updated on Jul 8 2023 8:33 AM

Sebi Carves Out Core Responsibilities For Mutual Fund Trustees - Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణకు, పారదర్శకత పెంచేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. మ్యూచువల్‌ ఫండ్‌ ట్రస్టీలపై మరింత బాధ్యతలు మోపింది. ప్రతి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఏఎంసీ/మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణ సంస్థ) కొత్తగా యూనిట్‌ హోల్డర్‌ (ఇన్వెస్టర్‌) ప్రొటెక్షన్‌ కమిటీ (యూహెచ్‌పీసీ)ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఏఎంసీ నిర్ణయాలు యూనిట్‌ హోల్డర్ల ప్రయోజనాల కోణంలోనే ఉన్నాయా అన్నది యూహెచ్‌పీసీ పర్యవేక్షించనుంది. కొత్త నిబంధనలు జనవరి 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వ స్తాయని సెబీ శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేసింది. 
ఇవీ కొత్త మార్గదర్శకాలు 

మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ నిర్వహణ ఆస్తులను పెంచుకునేందుకు తప్పుడు మార్గాల్లో పెట్టుబడులను ఆకర్షించకుండా తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా సంబంధిత మ్యూచువల్‌ ఫండ్‌ ట్రస్టీ చూడాలి. 

తమ ఉద్యోగులు, అనుబంధ సంస్థలు దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలి. మోసపూరిత లావాదేవీలు చోటు చేసుకోకుండా, ఉద్యోగులు ఫ్రంట్‌ రన్నింగ్‌కు పాల్పడకుండా (సంస్థ నిర్ణయాలు ముందే తెలుసుకుని ప్రయోజనం పొందడం), డిస్ట్రిబ్యూటర్లు ఆకర్షించే అంచనాలతో ఉత్పత్తులను విక్రయించకుండా తగిన చెకింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి. 

 ఏంఎసీలు వసూలు చేసే ఫీజులు, వ్యయాలు పారదర్శకంగా ఉండేలా ట్రస్టీలు చూడాలి.  

 ఏఎంసీల పథకాల వారీగా పనితీరు, పోటీ పథకాలతో, సూచీలతో పోల్చినప్పుడు ఎలా ఉందన్నది సమీక్షించాలి. 

 కేవైసీ వివరాలు సరిగ్గా లేని ఫోలియోల విషయంలో ఏఎంసీలు తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి.  

 ఈ బాధ్యతల నిర్వహణకు ఫండ్‌ ట్రస్టీలు ఆడి ట్, న్యాయ సేవల సంస్థలు, మర్చంట్‌ బ్యాంకర్లు, తదితర నిపుణుల సేవలు పొందొచ్చు. 

 ఓ కంపెనీ ఫండ్‌ ట్రస్టీగా నియమితమైతే, చైర్‌పర్సన్‌గా ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ ఉండాలి. 

మ్యూచువల్‌ ఫండ్స్‌ అందించే ఉత్పత్తులు, సేవలకు సంబంధించి యూనిట్‌ హోల్డర్ల ప్రయోజనాలకు యూహెచ్‌పీసీ బాధ్యత వహించాల్సి ఉంటుంది.  
ఫండ్‌ స్పాన్సర్లకు కొత్త నియమావళి 

మ్యూచువల్‌ ఫండ్‌ను స్పాన్సర్‌ చేసే ప్రైవేటు ఈక్విటీ సంస్థలకు కొత్త కార్యాచరణను సెబీ ప్రతిపాదించింది. ప్రైవేటు ఈక్విటీ సంస్థలకు ఫండ్‌ మేనేజర్‌గా కనీసం ఐదేళ్ల అనుభవం, కనీసం రూ.5,000 కోట్ల ఆస్తులను నిర్వహించి ఉండాలి.

Advertisement
 
Advertisement
Advertisement