వోస్తోక్‌ ప్రాజెక్ట్‌పై ఓవీఎల్‌ దృష్టి

OVL in talks to buy stake in Russia Vostok - Sakshi

మైనారిటీ వాటా కొనుగోలుకు చర్చలు

నోవాటెక్‌ వాటా కోసం పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ ప్రయత్నాలు

న్యూఢిల్లీ/ మాస్కో: విదేశీ అనుబంధ సంస్థ ద్వారా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ.. రష్యాకు చెందిన భారీ ప్రాజెక్ట్‌ వోస్తోక్‌ ఆయిల్‌లో మైనారిటీ వాటా కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకు ఇప్పటికే ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌(ఓవీఎల్‌) చర్చలు నిర్వహిస్తున్నట్లు చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. మరోపక్క లిక్విఫైడ్‌ గ్యాస్‌ ప్రాజెక్ట్‌ ఆర్కిటిక్‌ ఎల్‌ఎన్‌జీ–2లో మైనారిటీ వాటాను సొంతం చేసుకునే ప్రణాళికల్లో పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్కిటిక్‌లో 9.9 శాతం వాటాను నోవాటెక్‌ నుంచి కొనుగోలు చేసేందుకు పెట్రోనెట్‌ చర్చలు చేపట్టినట్లు వెల్లడించారు.

వోస్తోక్‌ ఆయిల్‌ ప్రాజెక్టు 6 బిలియన్‌ టన్నులు లేదా 44 బిలియన్‌బ్యారళ్ల ప్రీమియం చమురు నిక్షేపాలు(రీసోర్సెస్‌) కలిగి ఉంది. ఇక ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తికి రష్యాలో అతిపెద్ద సంస్థగా నిలుస్తున్న నోవాటెక్‌ 11 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్కిటిక్‌ ప్రాజెక్టులో 60 శాతం వాటాను కలిగి ఉంది. ఫ్రాన్స్‌ దిగ్గజం టోటల్, జపనీస్‌ కన్సార్షియం విడిగా 10 శాతం చొప్పున వాటాలను పొందాయి. చైనా కంపెనీ సీఎన్‌పీసీ, సీనూక్‌ లిమిటెడ్‌ మిగిలిన 20 శాతం వాటాను సమానంగా పంచుకున్నాయి. 2023కల్లా ఆర్కిటిక్‌ తొలి కన్‌సైన్‌మెంట్‌ను ప్రారంభించగలదని అంచనా. ఈ బాటలో 2025కల్లా 19.8 మిలియన్‌ టన్నుల సామర్థ్యాన్ని అందిపుచ్చుకోగలదని భావిస్తున్నారు.  

కొత్త పెట్టుబడులు..: రష్యాలో జరుగుతున్న తూర్పుప్రాంత ఆరి్థక వేదిక సమావేశాలకు హాజరైన హర్‌దీప్‌ సింగ్‌ ఢిల్లీకి తిరిగి వచ్చేముందు మాస్కోలో విలేకరులతో పలు అంశాలను ప్రస్తావించారు. వోస్తోక్‌ ఆయిల్, ఆర్కిటిక్‌ ఎల్‌ఎన్‌జీ–2లో పెట్టుబడి అవకాశాలపై చర్చించినట్లు తెలియజేశారు. ఈ వివరాలను తాజాగా వెల్లడించారు. వోస్తోక్, ఆర్కిటిక్‌ పెట్టుబడులు భారత్, రష్యాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేందుకు దారిచూపనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top