ఎన్‌టీపీసీ లాభం హైజంప్‌..! | NTPC Q4 Profit Jumps To High | Sakshi
Sakshi News home page

ఎన్‌టీపీసీ లాభం హైజంప్‌..!

Jun 21 2021 10:35 PM | Updated on Jun 21 2021 10:35 PM

NTPC Q4 Profit Jumps To High - Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌టీపీసీ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు మూడు రెట్లు ఎగసింది. రూ. 4,649 కోట్లకుపైగా ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 1,630 కోట్లు మాత్రమే సాధించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 31,330 కోట్ల నుంచి రూ. 31,687 కోట్లకు నామమాత్రంగా పుంజుకుంది.  వాటాదారులకు షేరుకి రూ. 3.15 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ఫిబ్రవరిలో రూ. 3 మధ్యంతర డివిడెండును చెల్లించిన సంగతి తెలిసిందే. క్యూ4లో స్థూల విద్యుదుత్పత్తి 68.27 బిలియన్‌ యూనిట్ల నుంచి 77.63 బి.యూకి పెరిగింది. 

పూర్తి ఏడాదికి 
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 11,192 కోట్ల నుంచి రూ. 14,969 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,12,373 కోట్ల నుంచి రూ. 1,15,547 కోట్లకు ఎగసింది. రుణాల ద్వారా నిధుల సమీకరణ పరిమితిని బోర్డు రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.25 లక్షల కోట్లకు పెంచింది. గతేడాది విద్యుదుత్పత్తి 259.61 బిలియన్‌ యూనిట్ల నుంచి 270.9 బీయూకి పెరిగింది. మొత్తం గ్రూప్‌ కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 314.07 బీయూని సాధించినట్లు కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది.

2019–20లో ఇది 290.19 బీయూ మాత్రమేనని తెలియజేసింది. కాగా.. క్యూ4లో బొగ్గు ఉత్పత్తి 2.6 మిలియన్‌ టన్నుల నుంచి 3.7 ఎంటీకి పుంజుకుంది. పూర్తి ఏడాదికి మాత్రం 9.63 ఎంటీ నుంచి 9.46 ఎంటీకి తగ్గింది. క్యూ4లో ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌) 69.52 శాతం నుంచి 77.12 శాతానికి మెరుగుపడింది. పూర్తి ఏడాదికి 68 శాతం నుంచి 66 శాతానికి నీరసించింది.  సగటు విద్యుత్‌ టారిఫ్‌ యూనిట్‌కు రూ. 3.9 నుంచి రూ. 3.77కు తగ్గింది. 

చదవండి: 5జీ నెట్‌వర్క్‌: ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement