బడ్జెట్: మేడమ్... మధ్య తరగతిని మర్చిపోకండి | Middle class expectations from union budget 2025 26 | Sakshi
Sakshi News home page

బడ్జెట్: మేడమ్... మధ్య తరగతిని మర్చిపోకండి

Jan 30 2025 7:35 PM | Updated on Jan 31 2025 1:37 PM

Middle class expectations from union budget 2025 26

బడ్జెట్ అనగానే ఎదురుచూపులు...
భారీ ఆశలు... కోర్కెల చిట్టాలు...
చివరకు నిట్టూర్పులు...
ప్రతిసారీ మధ్యతరగతి వర్గం పరిస్థితి ఇదే...
ఈసారైనా కాస్త మార్పు వస్తుందేమోనన్న ఆశ.

2025-26 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ఆర్ధిక మంత్రి ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కొన్ని విప్లవాత్మక నిర్ణయాలకు వేదికగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత మూడోసారి కొలువు తీరిన మోదీ సర్కారు నుంచి వెలువడే ఈ బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు తీయించగల కొన్ని కఠిన నిర్ణయాలతో పాటు.. సామాన్యులను ఇరకాటంలో పెట్టని విధంగా సమతౌల్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఆర్ధిక వృద్ధి రేటు మందగించి.. రూపాయి నానాటికీ క్షీణిస్తూ... స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న ప్రస్తుత తరుణంలో ఏమాత్రం బ్యాలన్స్ తప్పినా...జరిగే నష్టాన్ని పూడ్చడం అంత తేలిక్కాదు. ఈనేపథ్యంలో వృద్ధికి పట్టుగొమ్మగా నిలిచే మధ్య తరగతి వర్గాలను... మరీ ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను మెప్పించడం ప్రధానం.

దేశంలో ఆదాయపు పన్ను క్రమం తప్పక చెల్లిస్తున్నది ఉద్యోగ వర్గాలే. వీళ్లకు టీడీఎస్ రూపంలో జీతం ఇచ్చేటప్పుడే పన్ను కోత జరుగుతుంది. మిగతా వర్గాల్లో పన్ను వసూళ్లు ఉన్నప్పటికీ వారికి దక్కే మినహాయింపులు వేరు. ఖర్చులు పెరిగిపోయి... వచ్చే ఆదాయాలు ఏమూలకూ సరిపోని ఈరోజుల్లో... తమను చిన్న చూపు చూడొద్దంటూ అత్యధిక సంఖ్యలో పన్ను చెల్లించే మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

రాబోయే బడ్జెట్ నుంచి వీరు ఏమి ఆశిస్తున్నారో... ఏమి చర్యలు ప్రకటిస్తే బావుంటుందో చూద్దాం.

1. సెక్షన్ 80 సీ: ఆదాయపు పన్ను చట్టంలోని ఈ సెక్షన్ రూ.1 .50 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పిస్తోంది. 2014 నుంచి చిన్న చిన్నవి తప్పిస్తే... ఈ సెక్షన్ లో పెద్దగా మార్పులే చోటు చేసుకోలేదు. ఈ పరిమితిని కనీసం రూ.2 లక్షల వరకైనా పెంచాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత అధిక ధరలు, ఖర్చుల నేపథ్యంలో... ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సంపాదించే ఆదాయం వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోతున్న నేపథ్యంలో సగటు జీవులు పొదుపు చేసే పరిస్థితులు సన్నగిల్లాయి. పొదుపు చేసే పరిస్థితులే లేనప్పుడు వారు ఇక పెట్టుబడులు ఎలా పెట్టగలుగుతారు. పెట్టుబడులు రానప్పుడు ఆర్ధిక వ్యవస్థ పరుగులు ఎలా తీస్తుంది? కాబట్టి ఆర్ధిక మంత్రి ఇప్పటికైనా దశాబ్దానికి పైగా పడకేసిన మార్పుల్ని ఈ సెక్షన్ లో చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ట్యాక్ సేవింగ్ పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లు వంటి పథకాల్లో పొదుపు పెరుగుతుంది. విస్మరించకూడని సెక్షన్ ఇది.

2. సెక్షన్ 80డీ : రానురాను ఆరోగ్య సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. చిన్న రోగం వచ్చిందంటే చాలు... వేలల్లో వెచ్చించాల్సి వస్తోంది. ఇక పెద్ద రోగాలయితే చెప్పనక్కర్లేదు... లక్షలు పెట్టాల్సిందే. కొంతవరకు బీమా ప్రయోజనాలు దక్కుతున్నప్పటికీ.. ఇప్పటికీ బీమాకు దూరంగా ఉంటున్న వర్గాలే ఎక్కువ. పన్ను చెల్లింపుదారులకు కొద్దో గొప్పో ప్రయోజనాన్ని కల్పిస్తోందీ సెక్షన్. వైద్య ఖర్చులపై వెచ్చించే మొత్తానికి ప్రస్తుతం వృద్ధులకు రూ.50,000, మిగతా వర్గాలకు రూ.25,000 వరకు పన్ను తగ్గింపు లభిస్తోంది. ఈమొత్తాన్నివృద్ధుల విషయంలో రూ. లక్షకు, మిగతా వారికి రూ.50,000 వరకు పెంచాల్సిన అవసరం ఉంది.

3. సీనియర్ సిటిజెన్లు: ప్రభుత్వం ప్రతిసారీ వీరికి ఇతోధిక ప్రయోజనాలను కల్పిస్తూ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా అవి సరిపోవు. వీళ్ళు వయసు పెరిగి.. శ్రమ శక్తి తగ్గి... సంపాదనా సామర్ధ్యం మూలన పడి.. అనారోగ్యాలు పలకరిస్తూ.. కేవలం పెన్షన్ నో, అంతో ఇంతో దాచుకున్న డబ్బులనో.. లేదంటే పిల్లలు పంపే సొమ్ములనో నమ్ముకుని కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఈ వర్గాలకు పన్ను, వడ్డీ మినహాయింపులు అధిక మేలు చేస్తాయి. ప్రభుత్వం తప్పనిసరిగా వీరి విషయంలో ఉదారంగా వ్యవహరించాల్సిందే.

4 హెచ్ఆర్ఏ: ఢిల్లీ, కోల్ కతా వంటి మెట్రో నగరాల్లోని ఉద్యోగులు తాము పొందే హెచ్ ఆర్ ఏ పై 50 శాతం వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇదే విధానాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి టైర్ - 2 నగరాలకు కూడా వర్తింపజేయాలి. ఈ నగరాలు కూడా టైర్-1 సిటీ లతో పోటీపడుతూ పరుగులు తీస్తున్నాయి. ఈ నగరాల్లోనూ జీవన వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఈనేపథ్యంలో ఉద్యోగుల ఆదాయ ఉపశమన చర్యల్లో భాగంగా వీరికి కూడా హెచ్ఆర్ఏ లో 50% రిబేటు ప్రయోజనాన్ని కల్పించాలి. 

5 . గృహ రుణాల వడ్డీ: మధ్యతరగతి వర్గాల ప్రధాన కల తమకంటూ ఓ సొంత ఇంటిని కట్టుకోవడం. వీరిలో 99% మంది బ్యాంకులు/ఇతర ఆర్ధిక సంస్థల రుణాలపైనే ఆధారపడతారు. వీరు చెల్లించే ఈఎంఐ లో పెను భారం మోపేది వడ్డీలే. గృహ రుణాల వడ్డీపై ఇప్పటిదాకా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద రూ.2 లక్షల వరకు వడ్డీని ఆదాయం నుంచి మినహాయించి చూపించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 70  లక్షలు వెచ్చించాల్సి వస్తోంది.   ఇందులో రూ. 50 లక్షలు బ్యాంకు లోన్ తీసుకున్నా తక్కువలో తక్కువ రూ.4 లక్షల దాకా వార్షిక వడ్డీ లెక్క తేలుతుంది. కాబట్టి వడ్డీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత స్థాయి నుంచి కనీసం రూ. 3 లక్షల వరకైనా పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అన్నిటికంటే ప్రధానమైనది ఆదాయపు పన్ను రేట్లు. ట్యాక్ స్లాబుల్లో మార్పులు. వీటి గురించి తదుపరి ఆర్టికల్ లో చర్చించుకుందాం.

-బెహరా శ్రీనివాస రావు 
ఆర్ధిక విశ్లేషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement