ఎల్ఐసీ ఐపీఓకు వచ్చేది అప్పుడేనా..? | Sakshi
Sakshi News home page

ఎల్ఐసీ ఐపీఓకు వచ్చేది అప్పుడేనా..?

Published Fri, Feb 18 2022 9:11 PM

LIC Likely To Launch 8 Billion Dollars IPO on March 11: Report - Sakshi

మదుపర్లలో ఎంతో ఆసక్తి రేకిస్తున్న ప్రభుత్వ రంగ భీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓకు మార్చి 11న వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 8 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఇష్యూతో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్ప్(ఎల్ఐసీ) మార్చి 11న యాంకర్ పెట్టుబడిదారుల కోసం ఐపీఓకు రానున్నట్లు రాయిటర్స్ తెలిపింది. రెండు రోజుల తర్వాత ఇతర పెట్టుబడిదారులకు పబ్లిక్ ఇష్యూ అందుబాటులోకి వస్తుందని తెలుస్తుంది. ఎల్ఐసీ ఐపీఓ మార్చి మొదటి వారంలో సెబీ నుంచి అనుమతి పొందనున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. అలాగే, సెబీ నుంచి అనుమతి పొందిన తర్వాత పబ్లిక్ ఇష్యూ ధరను నిర్ణయించే అవకాశం ఉంది. 

అయితే, ఈ విషయంపై ఎల్ఐసీ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఐపీఓ లాంఛ్ షెడ్యూల్ మారవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఈ బీమా కంపెనీ షేర్ల ధర ఒక్కొక్కటి రూ.2,000 నుంచి రూ.2,100 మధ్య ఉండవచ్చని బ్లూమ్ బెర్గ్ బుధవారం నివేదించింది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ ఆదివారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మూసాయదా పత్రాలను దాఖలు చేసింది. భారత ప్రభుత్వం తనకున్న 100 శాతం వాటాలో 5% వాటాను విక్రయించి దాదాపు 8 బిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తుంది. 

ఎల్ఐసీ మార్చి మధ్యనాటికి పబ్లిక్ షేర్లను జారీ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు గత నెలలో రాయిటర్స్'కు తెలిపాయి. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 6.4% ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం మార్చి చివరినాటికి ఐపీఓను పూర్తి చేయాలని తొందరపడుతోంది. ఇది ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు 60,000 కోట్ల రూపాయలు సేకరించాలని అనుకుంటుంది. ఎల్‌ఐసీ ఐపీఓలో జాబితా చేసిన తర్వాత రూ.8-10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువతో దేశంలో అతిపెద్ద సంస్థగా మారే అవకాశం ఉంది. 

(చదవండి: వేసవి కాలంలో కరెంటు కోతలు తప్పవా..?)

Advertisement
Advertisement