కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లాభం 22% అప్‌

 Kotak Mahindra Bank's consolidated PAT up 22percent in Q 2to Rs 2,947 cr - Sakshi

క్యూ2లో రూ. 2,947 కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.2,947 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 2,407 కోట్లతో పోలిస్తే 22% వృద్ధి చెందింది. మొత్తం ఆదా యం రూ.12,543 కోట్ల నుంచి రూ.13,591 కోట్లకు చేరింది.

స్టాండెలోన్‌గా చూస్తే...
కేవలం బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై (స్టాండెలోన్‌) క్యూ2లో కోటక్‌ బ్యాంక్‌ రూ.2,184 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,724 కోట్లతో పోలిస్తే 27 శాతం ఎగబాకింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం కూడా రూ.7,986 కోట్ల నుంచి రూ.8,288 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.3,913 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 4.6 శాతం నుంచి 4.53 శాతానికి క్షీణించింది. ‘గడిచిన కొద్ది త్రైమాసికాలుగా బ్యాంక్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్స్, వాణిజ్య బాండ్లు, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు వంటి రుణేతర సాధనాలపై అధికంగా ఆధారపడుతోంది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ మేం అనుసరిస్తున్న అప్రమత్త ధోరణికి గత ఆరు నెలల రుణ వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి ఇది మరింత భద్రమైన మార్గంగా మేం భావిస్తున్నాం‘ అని కోటక్‌ బ్యాంక్‌ ఎండీ దీపక్‌ గుప్తా పేర్కొన్నారు.

మొండిబాకీలు ఇలా...
మొత్తం రుణాల్లో నికర మొండిబకాయిలు (ఎన్‌పీఏ) గతేడాది క్యూ2లో 0.85 శాతం (రూ.1,811 కోట్లు) నుంచి ఈ ఏడాది క్యూ2లో 0.64 శాతానికి (రూ.1,304 కోట్లు) తగ్గుముఖం పట్టాయి. స్థూల ఎన్‌పీఏలు మాత్రం 2.32 శాతం (రూ.5,034 కోట్లు) నుంచి 2.55 శాతానికి (రూ.5,336 కోట్లు) పెరిగాయి. మొండిబాకీలు, కంటింజెన్సీలకు మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్‌) రూ.408 కోట్ల నుంచి రూ.369 కోట్లకు దిగొచ్చాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top