
48 పైసలు పతనమై 87.66 వద్ద ముగింపు
రూపాయి మళ్లీ బక్కచిక్కుతోంది. డాలర్ మారకంలో దేశీ కరెన్సీ విలువ సోమవారం 48 పైసలు బలహీనపడి 87.66 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 55 పైసలు క్షీణించి 87.73 వద్ద కనిష్టాన్ని తాకింది. వాణిజ్య సుంకాల అనిశి్చతులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దేశీ కరెన్సీ కోతకు కారణమయ్యాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడమూ ఒత్తిడిని పెంచిందని నిపుణులు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 10న రూపాయి 87.95 వద్ద జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ‘ఏదో అలా బ్రతికేస్తున్నాం.. అంతే..’
రూపాయి పతనానికి కారణాలు..
1. ఇండియన్ రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.
2. ముడిచమురు ధర పెరుగుతోంది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.
3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి.
4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గిస్తున్నాయి. జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.