ట్రిలియన్‌ డాలర్ల ఎగుమతులు: పీయూష్‌ గోయల్‌ పిలుపు | India Targets 1 Trillion Dollar Exports as Piyush Goyal Urges Industry Push | Sakshi
Sakshi News home page

ట్రిలియన్‌ డాలర్ల ఎగుమతులు: పీయూష్‌ గోయల్‌ పిలుపు

May 14 2026 7:22 PM | Updated on May 14 2026 8:04 PM

India Targets 1 Trillion Dollar Exports as Piyush Goyal Urges Industry Push

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల ఎగుమతులు ట్రిలియన్‌ డాలర్ల మార్కునకు చేర్చాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన దీనిపై మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా సుంకాల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రికార్డు స్థాయిలో 863.11 బిలియన్‌ డాలర్లకు (4.6 శాతం వృద్ధి) పెరిగినట్టు మంత్రి చెప్పారు. ఇందులో వస్తు ఎగుమతులు 0.93 శాతం పెరిగి 441.78 బిలియన్ల డాలర్లుగా ఉంటే, సేవల ఎగుమతులు 8.71 శాతం పెరిగి 421.32 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు వెల్లడించారు. మరో 137 బిలియన్‌ డాలర్లు పెంచుకోవడం ద్వారా ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని సాధించాలని కోరారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల మద్దతు..
పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకోవడం ద్వారా ఆయా మార్కెట్లలో భారత ఉత్పత్తులకు ద్వారాలు తెరుస్తున్నట్టు మంత్రి గోయల్‌ తెలిపారు.

భారత వస్తువులకు అంతర్జాతీయ విపణిలో ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 2021 నుంచి ఇప్పటివరకు తొమ్మిది కీలక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు గుర్తు చేశారు. ఇందులో నాలుగు అమల్లోకి రాగా, మిగిలిన ఐదు వచ్చే 12 నెలల్లో ఆచరణలోకి రానున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి చిలీ, మాల్దీవులతో ఒప్పందాలు పూర్తవుతాయని.. కెనడా, ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలు, రష్యాతోనూ చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement