Hyderabad Based Shreyas Media is Expanding Its Business Across The Globe - Sakshi
Sakshi News home page

Shreyas Media: గ్లోబల్‌ కంపెనీగా శ్రేయాస్‌ మీడియా

May 3 2022 2:21 PM | Updated on May 3 2022 3:18 PM

Hyderabad Based Shreyas Media is Expanding Its Business Across The Globe - Sakshi

హైదరాబాద్‌: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌ లో దేశంలో అగ్ర శ్రేణి కంపెనీ శ్రేయాస్‌ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదారులు ఈ నిధులను సమకూరుస్తున్నారు. 2011లో ప్రారంభమైన హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉండడం విశేషం. ఇటీవలే కంపెనీ దుబాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగుతో మొదలై దక్షిణాది భాషలకు సేవలను  విస్తరించింది.

విస్తరణ బాటలో 
మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్ తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు ఈ నిధులను వినియోగిస్తామని  శ్రేయాస్‌ గ్రూప్ ఫౌండర్‌ గండ్ర శ్రీనివాస్‌ రావు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ప్రజలకు సులువుగా చేరువ కావడానికి దక్షిణాది సినిమాలతో కలిసి పనిచేసేందుకు దేశ, విదేశీ బ్రాండ్స్ సిద్ధంగా ఉన్నాయి. స్పాన్సర్స్ కు సినిమాలతో పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చేలా ఈవెంట్స్ చేస్తున్నాం. నిర్మాతలకు సినిమా ప్రమోషన్ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. కార్యక్రమాల్లో సినీ తారలు ఉండడంతో బ్రాండ్స్ సులువుగా వీక్షకులకు చేరువ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇది విభిన్న కాన్సెప్ట్‌. సినిమా తారలు, నటులు, దర్శకులు, నిర్మాతలకు సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఒక్కో కార్యక్రమం గరిష్టంగా 10 కోట్ల మందికిపైగా ప్రజలు  వీక్షిస్తున్నారు. సినిమాతో ముడిపడి ఏ కార్యక్రమం చేసినా స్పాన్సర్‌ బ్రాండ్స్‌ కోట్లాది మందికి చేరువ అవుతున్నాయి. అందుకే పెద్ద బ్రాండ్స్‌ సైతం స్పాన్సర్‌షిప్‌కు ముందుకు వస్తున్నాయి. దక్షిణాది సినిమాల గురించి దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఇది మాకు, బ్రాండ్స్‌కు గొప్ప వ్యాపార అవకాశం. మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌ రంగంలో ఏక ఛత్రాధిపత్యం సాగిస్తున్నాం" అని వివరించారు.

సినిమా చుట్టూ బ్రాండ్స్‌..
తెలుగుతోపాటు భారతీయ సినిమాలకు గ్లోబల్‌ అటెన్షన్‌ వచ్చింది. సినిమాను ఆసరాగా చేసుకుని కొత్త విభాగాల్లో ప్రవేశిస్తామని శ్రీనివాస్‌ వెల్లడించారు. ‘ఇందులో భాగంగా  శ్రేయాస్ఈటీ ఓటీటీని పునర్నిర్మిస్తాం. కొత్త టెక్నాలజీతో ఇంటెరాక్టివ్‌ మూవీస్, మినీ, స్నాక్ మూవీస్ తోపాటు తొలిసారిగా 8డీ మూవీస్‌ పరిచయం చేస్తాం.  రెట్రో మూవీస్‌ను పొందుపరుస్తాం.  శ్రేయాస్‌కు చెందిన కంటెంట్‌ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్న సౌత్‌ ప్లస్‌తో 100కుపైగా బ్రాండ్స్, 600లకు పైచిలుకు ఆర్టిస్టులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు చేతులు కలిపారు’ అని ఆయన వివరించారు. వచ్చే మూడేళ్లలో కస్టమర్లకు ఓటీటీ యాప్స్‌ ఉచితంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రకటనల ఆదాయం ఇందుకు కారణమని చెప్పారు.

ఐదేళ్లలో రూ. 700 కోట్లు
కంపెనీ 2027 నాటికి ఏటా 650 మూవీ ఈవెంట్స్, 120 మూవీ ప్రమోషన్స్‌ చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది. గ్రూప్‌ టర్నోవర్‌ రూ.700 కోట్లు ఆశిస్తోంది. ఇందులో మూవీ ఈవెంట్స్‌ వాటా రూ.285 కోట్లు ఉంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.20 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఇక లైవ్‌ ఈవెంట్స్‌ మార్కెట్‌ దేశంలో 2019లో రూ.8,300 కోట్లు నమోదు చేసిందని శ్రేయాస్‌ గ్రూప్‌ తెలిపింది. ‘మహమ్మారి కారణంగా మార్కెట్‌ తగ్గినప్పటికీ మూడేళ్లలో ఈ విభాగం కోవిడ్‌–19 ముందస్తు స్థాయికి చేరుకోనుంది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ 2030 నాటికి రూ.5.3 లక్షల కోట్లకు చేరుకోనుంది’ అని వివరించింది.  

చదవండి: కంపెనీల ఐపీవోకి సెబీ గ్రీన్‌ సిగ్నల్‌, టార్గెట్‌ రూ.7వేల కోట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement