పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌

Electric Vehicle charging facility at all petrol pumps - Sakshi

కియోస్క్‌ల ఏర్పాటుపై కేంద్రం దృష్టి

హైదరాబాద్‌ సహా కొన్ని నగరాల్లో అందుబాటులోకి...

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే దిశగా దేశవ్యాప్తంగా దాదాపు 69,000 పెట్రోల్‌ బంకుల్లో కనీసం ఒక్కటి చొప్పునైనా చార్జింగ్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీనితో పాటు ప్రభుత్వ రంగ రిఫైనర్లకు చెందిన సొంత బంకుల్లో (సీవోసీవో) ఈవీ చార్జింగ్‌ కియోస్క్‌ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈవీ చార్జింగ్‌ మౌలిక సదుపాయాలపై జరిగిన సమీక్ష సమావేశంలో చమురు శాఖ వర్గాలకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఈ మేరకు సూచనలు చేశారు.

ఇందుకోసం చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీ) తమ నిర్వహణలోని అన్ని సీవోసీవో పెట్రోల్‌ బంకుల్లో చార్జింగ్‌ కియోస్క్‌లను పెట్టే విధంగా చమురు శాఖ ఆదేశాలు జారీ చేయొచ్చని ఆయన సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇతరత్రా ఫ్రాంచైజీ ఆపరేటర్లు కూడా తమ ప్రతీ బంకులో కనీసం ఒక్కటైనా కియోస్క్‌ పెట్టేలా ఆదేశాలిస్తే.. దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం సాకారం కాగలదని పేర్కొన్నాయి.  నగరాలతో పాటు జాతీయ రహదారులపై కూడా ఈవీ చార్జింగ్‌ ఇన్‌ఫ్రాను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, వదోదర, భోపాల్‌ వంటి నగరాలపై చమురు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వివరించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top