GST: 9 నెలల తర్వాత తగ్గిన ఆదాయం | Centre Govenment Announced GST collections Drops to Rs 92849 Crore For June | Sakshi
Sakshi News home page

GST: 9 నెలల తర్వాత తగ్గిన ఆదాయం

Jul 6 2021 3:56 PM | Updated on Jul 6 2021 4:03 PM

Centre Govenment Announced GST collections Drops to Rs 92849 Crore For June - Sakshi

న్యూఢిల్లీ : కోవిడ్‌ ఆంక్షల ఎఫెక్ట్‌, కరోనా భయాలు, తగ్గిపోయిన ఉపాధి అవకాశాలు  ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపాయి. దీంతో తొమ్మిది నెలల తర్వాత గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ వసూళ్లు లక్ష కోట్లకు దిగువన నమోదు అయ్యాయి.  జూన్‌ నెలకు సంబంధించి కేంద్రానికి రూ.92,849 కోట్ల జీఎస్టీ ఆదాయమే వచ్చింది. అయితే గతేడాది జూన్‌తో పోలిస్తే ఈసారి జీఎస్టీ ఆదాయం 2 శాతం పెరగడం కొంత మేరకు ఊరట నిచ్చింది. 

చివరి సారిగా 2020 సెప్టెంబరులో కేంద్రానికి జీఎస్‌టీ ద్వారా రూ. 95,480 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఆదాయం తగ్గలేదు. ఆఖరికి కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా కొనసాగిన ఏప్రిల్‌​, మేలలోనూ లక్షకు పైగానే ఆదాయం వచ్చింది. అయితే మే లో దాదాపు దేశం మొత్తం లాక్‌డౌన్‌ , కఠిన కోవిడ్‌ ఆంక్షలు కొనసాగాయి. దీంతో జన జీవనం స్థంభించి పోయింది.  మే చివరి నుంచి సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టినా... చాలా మంది ఉపాధి కోల్పోవడం, డెల్టా వేరియంట్‌ భయాలు కొనసాగుతుండంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. దీంతో వస్తు సేవల పన్ను వసూళ్లు తగ్గాయి. 

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌కి ముందు జీఎస్టీ వసూళ్లు మేలో రూ. 1.02 లక్షల కోట్లు, ఏప్రిల్‌లో రూ.1.41 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. మరోవైపు  ఈ వే బిల్లులు కూడా మందగించాయి. 2021 మేలో 3.99 ​కోట్ల బిల్లులు రాగా అంతకుముందు ఏప్రిల్‌లో ఈ సంఖ్య 5.88 కోట్లుగా ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement