తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ రుణ వ్యాపారాన్ని బలోపేతం చేయడం, ఖాతాదారులతో నేరుగా అనుసంధానం కావడం లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున రిటైల్ అవుట్రీచ్ కార్యక్రమాలను నిర్వహించింది. హైదరాబాద్, విజయవాడ, నరసరావుపేటల్లో శుక్రవారం నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమాల్లో భారీగా రుణ మంజూరు పత్రాలు అందించడంతో పాటు కీలకమైన పండుగ ఆఫర్లను బ్యాంక్ అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ రీజియన్లో..
హైదరాబాద్లో నిర్వహించిన మెగా అవుట్రీచ్ కార్యక్రమంలో బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ ఏ.డి. శ్రీనివాస్, రీజినల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ ప్రత్యేక ప్రచార కాలంలో ఇన్-ప్రిన్సిపల్ ఆమోదాలతో కలిపి మొత్తం రూ.172 కోట్ల రిటైల్ రుణాలు మంజూరు చేయగా అందులో రూ.125 కోట్లు నేరుగా ఖాతాదారులకు పంపిణీ చేశారు. అదనంగా రూ.24 కోట్ల విలువైన తాజా బిజినెస్ లీడ్స్ సాధించారు.
‘మాకున్న బలమైన ‘సీఏఎస్ఏ’ బేస్, తగిన నిధుల లభ్యత కారణంగానే పరిశ్రమలోనే అత్యంత పోటీ వడ్డీ రేట్లను అందించగలుగుతున్నాం. గృహలక్ష్మి, హోమ్, గోల్డ్, వెహికల్ లోన్లలో ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్తమ పథకాలు అందుబాటులో ఉన్నాయి’ అని ఏ.డి. శ్రీనివాస్ చెప్పారు.
విజయవాడ, నరసరావుపేటల్లో..
విజయవాడలో రీజినల్ హెడ్ ఈ.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రుణ అవగాహన క్యాంప్ జరిగింది. ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా పారదర్శకమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

అలాగే, నరసరావుపేట శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రీజినల్ హెడ్ జి.రమణారావు పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు సుమారు రూ.2 కోట్ల విలువైన గృహ రుణ మంజూరు పత్రాలను అందజేశారు. రాబోయే పండుగ సీజన్ను పురస్కరించుకుని డిసెంబర్ 2026 వరకు గృహ రుణాలు, కారు రుణాలపై 100 శాతం ప్రాసెసింగ్ ఛార్జీల మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

సులభతర బ్యాంకింగ్
‘మీ కలలకు మా సంకల్పం’ అనే నినాదానికి కట్టుబడి రిటైల్ బ్యాంకింగ్ విస్తరణలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిబద్ధతను మరోసారి చాటుకుంటున్నట్లు బ్యాంకు అధికారులు చెప్పారు. అర్హులైన ప్రజలంతా సమీప శాఖలను సంప్రదించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్


