కేంద్ర బడ్జెట్ 2026–27లో క్యాన్సర్ రోగులకు కీలక ఉపశమనం లభించింది. 17 క్యాన్సర్ సంబంధిత మందులు, ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో క్యాన్సర్ చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.
“రోగులకు, ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో 17 మందులు లేదా ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని ప్రతిపాదిస్తున్నాను” అని ఆమె పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టే సందర్భంగా తెలిపారు.
అదేవిధంగా, ఔషధాలు, మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం ఆహారం (FSMP) వ్యక్తిగత దిగుమతులపై సుంకం మినహాయింపు పొందే జాబితాలో మరో ఏడు అరుదైన వ్యాధులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యతో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూడా ఆర్థిక భారంలో తగ్గుదల కలగనుంది.
ఈ నిర్ణయంతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే అత్యవసర క్యాన్సర్ మందుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు అధిక కస్టమ్స్ సుంకాల కారణంగా ఖరీదైన చికిత్సలు అందని ద్రాక్షలా మారిన పరిస్థితి ఉండగా, తాజా ప్రతిపాదనతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. అలాగే దేశంలో క్యాన్సర్ చికిత్స అందుబాటును పెంచడంతో పాటు, ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వ సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


