అశ్వారావుపేటరూరల్: వేసవి సెలవులను వృథా చేయకుండా స్వతహాగా ఉన్న ఆసక్తితో బొమ్మలు గీస్తూ ప్రతిభ చాటుతోంది ఓ విద్యార్థిని. అశ్వారావుపేట బీఎస్ఆర్ నగర్కు చెందిన కృష్ణారెడ్డి – తిరుపతమ్మ దంపతుల కుమార్తె లక్కిరెడ్డి ఏశ్విత సాయి రోషిణిశ్రీ 9వ తరగతి పూర్తి చేసింది. కొంతకాలంగా చదువుతో పాటు బొమ్మలు గీయడంలో కుడా ఆసక్తి చూపించడంతో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. దీంతో తక్కువ రోజుల్లోనే వందల సంఖ్యలో బొమ్మలు గీసింది. చిత్రకళలో రాణించాలంటే కొద్దోగొప్పో శిక్షణ అవసరం. కానీ ఏశ్విత సాయిరోషిణిశ్రీ మాత్రం ఎలాంటి శిక్షణ లేకుండానే అందమైన బొమ్మలను చకచకా వేస్తోంది. పెన్సిల్, వాటర్ కలర్లు, పెన్నులతో జాతీయ నాయకులు, గ్రామీణ మహిళలు, గ్రామీణ ప్రకృతి అందాలు, సామాజిక అంశాలు, రాజకీయ నాయకులు, దేవుళ్లు, సినీ నటుల చిత్రాలను గీస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాదు లీఫ్ ఆర్ట్స్, పేపర్ ఆర్ట్స్ సైతం అద్భుతంగా చేస్తోంది. ఆమె గీసిన బొమ్మలకు సోషల్ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల అభినందనలు అందుతున్నాయి.


