సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 ప్రవేశ పునర్పరీక్షను సజావుగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న నిర్వహించే పరీక్షకు జిల్లాలో 1,128 మంది అభ్యర్థులు హాజరు కానుండగా, నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలన్నా రు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా, జవాబు పత్రాల భద్రతకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడతామని చెప్పారు. అభ్యర్థులు, తల్లిదండ్రులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. డీఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, డి సెక్షన్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, తహసీల్దార్లు పుల్లారావు, దారా ప్రసాద్, పరీక్షా కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మణుగూరు మున్సిపాలిటీలో
నక్ష సర్వే..
నక్ష పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో ఎంపికై న మణుగూరు మున్సిపాలిటీలో సర్వే, రెవెన్యూ శాఖల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ అంకిత్ అన్నారు. భూముల రీ సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు (నక్ష) కార్యక్రమాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వమించారు. కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ద్వారా ఆర్ఓఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. మణుగూరు మున్సిపాలిటీలో సుమారు 7,524 ఆస్తులను గుర్తించామని, ఇప్పటికే 5,064 ఆస్తుల సర్వే పూర్తయిందని వివరించారు. 2,074 ఆస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఏడీ సర్వే శ్రీనివాస్, మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


