సూపర్బజార్(కొత్తగూడెం): పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, యూరియా యాప్ను తొలగించాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ముద్దా భిక్షం, బుర్ర వెంకన్న, కంగాల కల్లయ్య, బానోత్ ధర్మ, ఈసం శంకర్, గొగ్గల వెంకటేశ్వర్లు, శ్రీరామ్ కోటయ్య, బైరు వెంకన్న, జూకంటి గాంధీ, నాయిని రాజు పాల్గొన్నారు.


