భద్రాచలంటౌన్: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా శుక్రవారం భద్రాద్రి స్వరాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల పాటల పోటీలు భద్రాచలంలో ఘనంగా జరిగాయి. సుమారు 50 మంది గాయకులు పోటీపడగా, ముఖ్య అతిథి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. పురుషుల విభాగంలో మురళి (భద్రాచలం–రూ.15 వేలు), వినయ్ (హైదరాబాద్–రూ.10 వేలు), పెద్దిరాజు (రెడ్డిపాలెం–రూ.5 వేలు) మొదటి మూడు స్థానాల్లో నిలవగా.. మహిళల విభాగంలో మాధవి (విజయవాడ) ప్రథమ, కృష్ణవేణి ద్వితీయ, పూజారి జ్యోతి తృతీయ బహుమతులు సాధించారు. ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు రాజబాబు, జీవన్కుమార్, సరళాదేవి, నిర్వాహకుడు పోకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జామాయిల్ తోట దగ్ధం
కారేపల్లి: మండలంలోని బొక్కలతండా స్టేజీ సమీపాన రైతు వాకుండోత్ గన్యాకు చెందిన జామాయిల్ తోటకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. గ్రామంలో శుక్రవారం సాయంత్రం గాలిదుమారానికి విద్యుత్ వైర్లు రాసుకుని షార్ట్సర్క్యూట్ ఏర్పడడంతో నిప్పు రవ్వలు తోటపై పడి మంటలు మొదలయ్యాయి. సమీప రైతులు గమనించి ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేలోగానే తోట కాలిపోయింది. ఘటనలో రూ.3 లక్షల మేర ఆస్తినష్టం జరిగినందున ప్రభుత్వం ఆదుకోవాలని రైతు గన్యా కోరాడు.


