● ప్రజా సమస్యలపై ‘పోరుబాట’ ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
అశ్వారావుపేటరూరల్: ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఫలితంగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ ఆధ్వర్యాన చేపట్టే పోరుబాట కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేసి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేటలో నిర్వహిస్తున్న పార్టీ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు శుక్రవారం ముగియగా జాన్వెస్లీ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించకపోవడంతో అవన్నీ నీటిమీద రాతలుగా మారా యన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగా అర్హులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఇక విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నందున ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అంతేకాక ఆదివాసీలపై అటవీశాఖ వేధింపులకు తోడు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తోందని తెలిపారు. అనంతరం భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ కార్పొరేట్ల కోసమే గిరిజన చట్టాల్లో మార్పులు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల మనుగడ ను ప్రమాదంలోకి నెడుతోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, నాయకులు కనకయ్య, కె.పుల్లయ్య, నర్సారెడ్డి పాల్గొన్నారు.


