టేకులపల్లి: రైతులు రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడటం వల్ల నేల తల్లి జీవకళను కోల్పోతుందని, భూసారాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మట్టి పరీక్షలు చేయించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ టి.భరత్ రైతులకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఖేతి బచావో అభియాన్’కార్యక్రమంలో భాగంగా గురువారం టేకులపల్లి మండలం చంద్రుతండా గ్రామం అంబేద్కర్నగర్లో ‘మట్టి పరీక్షా, సమతుల్య ఎరువుల వినియోగం’అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవీకే ద్వారా అందిస్తున్న డబ్ల్యూజీఎల్ 44 (సిద్ది), కేఎన్ఎం 1638 వరి రకాలను ఎంచుకుని రైతులు అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ.. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆయిల్ పామ్, మునగ, తీగజాతి కూరగాయల వంటి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం టేకులపల్లి ఏఓ అన్నపూర్ణ మాట్లాడగా.. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష, ఉప సర్పంచ్ అనిత, గ్రామ సెక్రటరీ మోతిలాల్, అటవీ శాఖ అధికారి లక్ష్మణ్, ఉపాధ్యాయులు బాలు పాల్గొన్నారు.


