అమాంతం పెంచేశారు! | - | Sakshi
Sakshi News home page

అమాంతం పెంచేశారు!

Jun 5 2026 12:42 AM | Updated on Jun 5 2026 12:42 AM

కో.. అంటే రూ.కోటి గజం గర్జన ‘డబుల్‌’కు సమీపంలో.. ‘గూడెం’.. గుండె గుభేల్‌మనేలా

నేటి నుంచి అమల్లోకి

ఉమ్మడి జిల్లాలో అన్ని కేటగిరీల్లోనూ భారీగా పెంపు

ఖమ్మం అర్బన్‌, సత్తుపల్లిల్లో

రూ.కోటి దాటిన ఎకరా ధర

సర్వే నంబర్ల వారీగా ఖరారు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఉమ్మడి జిల్లా పరిధిలో భూముల మార్కెట్‌ విలువలకు రెక్కలొచ్చాయి. సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలను 100 శాతం వరకు పెంచగా.. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధరలను మాత్రం 20శాతానికి మించకుండా పరిమితం చేశారు. ప్రధానంగా రోడ్లకు ఇరువైపులా, ప్రధాన కూడళ్లలో ఉన్న భూముల విలువ భారీగా పెరిగింది. అయితే సర్వే నంబర్ల ఆధారంగా ధరలు నిర్ణయించడంతో రోడ్డు పక్క భూములకు భారీగా, లోపలి వైపు ఉన్న భూములకు స్వల్పంగా పెరగడంతో ఒకే గ్రామంలో రకరకాల ధరలు అమలవుతాయి.

ఖమ్మం అర్బన్‌, సత్తుపల్లి మండలాల పరిధిలోని కొన్ని రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ భూముల ధర ఎకరానికి ఏకంగా రూ.కోటి దాటింది. ఖమ్మం అర్బన్‌ మండలం ఖమ్మం, పాకబండ రెవెన్యూ పరిధిలో గతంలో ఎకరా వ్యవసాయ భూమి ధర రూ.84 లక్షలు ఉండగా.. దానిని ఏకంగా రూ.1.26 కోట్లకు పెంచారు. ఇక అత్యల్పంగా ఖమ్మం అర్బన్‌ మండలం మల్లెమడుగులో రూ.6.75 లక్షలు ఉన్న ధరను రూ.11.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సత్తుపల్లి మండలం అయ్యగారిపేట రెవెన్యూ గ్రామంలో గతంలో రూ.91.48 లక్షలు ఉన్న ఎకరా ధరను ఇప్పుడు రూ.1.14 కోట్లకు పెంచారు. ఇదే గ్రామంలో అత్యల్పంగా రూ.9 లక్షలుగా ఉన్న ధర రూ.18 లక్షలకు చేరింది.

ఖమ్మం కార్పొరేషన్‌ పరిధి లో ఇళ్ల స్థలాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. ప్రధాన వాణిజ్య కేంద్రమైన వైరా రోడ్డుకు ఇరువైపులా గతంలో గజం ధర రూ.44,900 ఉండగా.. ఇప్పుడు అది రూ.51,700 కు పెంచారు. అలాగే, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధర(ఎస్‌ఎఫ్‌టీ) అత్యల్పంగా రూ.2వేలు ఉండగా.. అది రూ.2,400కు చేర్చారు. అలాగే గరిష్ట ధర రూ.2,800గా ఖరారైంది.

వైరా మున్సిపాలిటీతో పాటు కొణిజర్ల మండలంలోనూ ధరలు భారీగానే పెరిగాయి. వైరా పరిధిలో వ్యవసాయేతర భూమి అత్యల్పంగా రూ,1,700 ఉన్న గజం ధరను రూ.3,000కు పెంచారు. అత్యధికంగా రూ.10,800 ఉన్న గజం ధర రూ.16,200కు చేరింది. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధర(ఎస్‌ఎఫ్‌టీ) రూ.1,500 నుంచి రూ.1,800కు చేర్చారు. ఇక కొణిజర్ల మండలంలో ఇళ్ల స్థలాల ధర గజానికి రూ.1,100 ఉంటే రూ.1,700కు పెంచారు. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లకు ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.1,300 నుంచి రూ.1,600కు పెరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో వ్యవసాయేతర భూముల ధరలను సైతం ప్రభుత్వం భారీగా పెంచింది. ఇళ్ల స్థలాల గజం ధర గతంలో కనిష్టంగా రూ.3,100 ఉన్న చోట దాన్ని ఇప్పుడు రూ.5,500గా నిర్ణయించారు. అలాగే గరిష్టంగా రూ.29,900 ఉన్న ధరను ఏకంగా రూ.37,400కు పెంచారు. ఇక్కడ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌ ధర(ఎస్‌ఎఫ్‌టీ) అత్యల్పంగా రూ.1,500 ఉండగా రూ.1,800కు.. అత్యధికంగా ఉన్న రూ.2,800 ధరను రూ.3,400కు చేర్చారు.

భూముల కొత్త మార్కెట్‌ ధరలు

Advertisement
 
Advertisement
Advertisement