సూపర్బజార్(కొత్తగూడెం): జనగణన ప్రక్రియలో రూపొందించే జాబితా ప్రజల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సూపర్వైజర్లతో గురువారం కలెక్టర్ తన కార్యాలయంలో జనగణన నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ సమయంలో ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సూపర్వైజర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కమిటీ సభ్యులకు అక్రిడిటేషన్ కార్డులు
అందజేసిన కలెక్టర్
జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు కలెక్టర్ అంకిత్ గురువారం తన చాంబర్లో అక్రిడిటేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అక్రిడిటేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అర్హులకు శుక్రవారం నుంచి జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ను కమిటీ సభ్యులు సత్కరించారు.
మరింత చేరువగా ప్రభుత్వ సేవలు
చండ్రుగొండ : ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయని కలెక్టర్ అంకిత్ తెలిపారు. మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులు పంట మార్పిడి చేసుకునేలా వ్యవసాయశాఖాధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలన్నారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. సర్పంచ్ దారావత్ రామారావు, డీఆర్డీఓ విద్యాచందన, తహసీల్దార్ జగదీశ్వర్ప్రసాద్, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ పాల్గొన్నారు.
జనగణన సమీక్షలో కలెక్టర్ అంకిత్


