సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ వేణుగోపాలచారి
అశ్వారావుపేటరూరల్: వినియోగదారులు విద్యుత్ సమస్యలపై తగిన ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు అందిస్తే 45 రోజుల్లో పరిష్కరించాలని సీజీఆర్ఎఫ్ చైర్ పర్సన్ వేణుగోపాలచారి అన్నారు. గురువారం అశ్వారావుపేటలోని విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో నిర్వహించిన వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరించారు. లోవోల్టేజీ సమస్య, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, కొత్త లైన్లు ఏర్పాటు, విద్యుత్ మీటర్ల సమస్యలపై, అశ్వారావుపేట, వినాయకపురం సబ్ స్టేషన్లలో ఏఈఈ పోస్టులు భర్తీ కాకపోవడం, విద్యుత్ సిబ్బంది ఖాళీలపై వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి 45 రోజులు దాటినా పరిష్కారం కాకపోతే విద్యుత్ ఫోరాన్ని ఆశ్రయించవచ్చని, ఫోరం తీర్పుపై అసంతృప్తి ఉంటే విద్యుత్ అంబుడ్స్మెన్ను ఆశ్రయించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ మహేందర్, డీఈఈ రంగస్వామి, ఏడీఈ వెంకట రత్నం, ఏఈఈలు శివశంకర్, వెంకట్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


