ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
పాల్వంచరూరల్: మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సిగ్నల్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో టెలికాం విభాగం ఏపీఎల్ఎన్ఏ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టి.భాస్కరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ కె.లక్ష్మణకుమార్, బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సి.రమణలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యను అధిగమించేందుకు 25 నూతన టవర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు గుర్తుచేశారు. ఈ ప్రక్రియలో జాప్యం చేయొద్దని ఆదేశించారు. గిరిజన, సరిహద్దు గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిరంతరాయంగా అందాలని అన్నారు. నెట్వర్క్ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో లోపాలను గుర్తించి, సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. టవర్ల ఏర్పాటుపై ప్రస్తుత స్థితిగతులు, సాంకేతిక అంశాలను అధికారులు వివరించారు.


