ఒకప్పుడు నలుగురు పిల్లలు కలిస్తే చాలు చుక్చుక్ రైలు వస్తోంది.. పక్కకు పక్కకు జరగండి.. ఆగినంక ఎక్కండి అంటూ పాడుతూ ఆడేవారు. కానీ ఇలాంటి క్రమేపి తెరమరుగయ్యాయి. అంతా ఆన్లైన్ ఆటలకు అలవాటుపడ్డారు. కానీ సత్తుపల్లి అయ్యగారిపేటలో చాన్నాళ్ల తర్వాత పిల్లలు చుక్చుక్ రైలు ఆడుతుండడం కనిపించింది! – సత్తుపల్లి టౌన్
గాలిదుమారం.. ఆగమాగం
చండ్రుగొండ: మండలంలో మంగళవారం రాత్రి గాలిదుమారం, వర్షం బీభత్సం సృష్టించింది. గాలిదుమారానికి అయ్యన్నపాలేనికి చెందిన దండుగుల చిట్టెమ్మ, బూరుగు లక్ష్మి, దాసరి చిట్టిబాబు, మరొ కరి ఇంటి పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. సత్యనారాయణపురంలో బచ్చల రామారావు ఇంటిపై భారీ వృక్షం పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభు త్వం అదుకోవాలని రేపల్లెవాడ సర్పంచ్ ఇర్పా స్రవంతి డిమాండ్ చేశారు. చండ్రుగొండ సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి అయన్నపాలెంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆర్ఐ తిరుపతిరావు నష్టపోయిన బాధితుల వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంతటి రామకృష్ణ, అంకిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
అకాల వర్షం.. అపార నష్టం
జూలూరుపాడు: మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుము లు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వినోభానగర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణయ్య రైతుకు చెందిన ఐదు ఎకరాల్లోని మునగ పంట దెబ్బతిన్నది. కాపు దశలో ఉన్న తరుణంలో ఈదురుగాలులతో సగానికి పైగా చెట్లు విరిగి పడగా రూ.3లక్షల నష్టం వాటిల్లింది. గంగావత్ శ్రీనుకు చెందిన మూడు ఎకరాల్లోని బొప్పాయి పంట దెబ్బతిని, రూ.2లక్షలు నష్టం వచ్చింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు. సిరికొండ లక్ష్మి ఇంటిపై చింత చెట్టు విరిగిపడింది. నిర్మాణ దశలో ఉన్న గంగావత్ హచ్చా ఇంటిపై చెట్టు పడటంతో గోడ కూలింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు. దెబ్బతిన్న పంటలను వినోభానగర్ సర్పంచ్ నవీన్, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఇళ్లపై చెట్లు విరిగిపడ్డ బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో చౌడం నరసింహారావు, గంగావత్ హచ్చానాయక్ తదితరులు పాల్గొన్నారు.


