రుద్రంపూర్: తెలంగాణ రాష్ట్ర సాధన తొలిదశ ఉద్యమంలో పాల్గొని పోలీసు కాల్పుల్లో బుల్లెట్లతో గాయపడిన కొత్తగూడెం హనుమాన్ బస్తీ వాస్తవ్యుడు మదనయ్యను తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోషియేషన్ నాయకులు చుంచుపల్లిలోని ఉద్యోగుల సంఘం భవనంలో మంగళశారం ఘనంగా సన్మానించారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించి 12 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వాలు ఉద్యమకారులను విస్మరించాయని, ఉద్యమంలో పాల్గొని అన్నీ కోల్పోయిన ఉద్యమాకారులను ఇప్పటికై నా గుర్తించి తగు పారితోషికం, ఇతర సదుపాయలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాపయ్య, సాయిబాబ, బి.వెంకటేశ్వర్లు, డిస్టిక్ట్ కౌన్సిలర్ గొల్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో విచారణ
చుంచుపల్లి: విద్యానగర్లోని పీఎం బ్రదర్స్ ఆస్పత్రిలో చికిత్సలపై ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాందాస్ ఆధ్వర్యాన మంగళవారం తనిఖీ చేపట్టారు. పూర్తి వివరాలతో కలెక్టర్, డీఎంహెచ్ఓకు నివేదిక ఇస్తామని ఆయన తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ హరీశ్, డాక్టర్ ప్రతాప్ పాల్గొన్నారు.
భారీ వర్షం
జూలూరుపాడు: మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో వర్షం ఉపశమనాన్ని కలిగించింది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకోవాలి
టేకులపల్లి: కొత్తగూడెం జిల్లా సారపాకలో మంగళవారం నిర్వహించిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా మహాసభలకు టేకులపల్లి మండలం నుంచి ఎన్నికై న ప్రతినిధులు వెళ్లారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు, గుగులోతు రామచంద్, నరసింహారావు, భూక్యా నర్సింగ్ మాట్లాడుతూ ఈ జిల్లా మహాసభల్లో చర్చించి ఆమోదించే కీలక నిర్ణయాలను, భవిష్యత్ కార్యాచరణను టేకులపల్లి మండలంలో అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే విరమించుకోవాలనే ప్రధానాంశంపై ఈ సభల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. మహాసభకు వెళ్లినవారిలో భూక్యా కీర్యా, అనంతోజు చంద్రచారి, పాయం సూరయ్య, కల్తీ స్వామి, బాలు, మేకల పొట్టయ్య తదితరులు ఉన్నారు.
నాణ్యమైన విత్తనాలు
పంపిణీ చేయాలి
జూలూరుపాడు: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు పచ్చిరొట్ట విత్తనాలతోపాటు, అన్నిరకాల పంటలకు నాణ్యమైన విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ ధర్మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పడమటనర్సాపురంలో జరిగిన అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) కొత్తగూడెం డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నకిలీ విత్తనాలతో దళారీ వ్యవస్థ పెరిగిందని ఆరోపించారు. దీంతో రైతులు దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పాత రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, అదేవిధంగా సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బైరి వెంకన్న, లింగాల వీరభద్రం, తోటకూరి నరేష్, పారుపల్లి బాబురావు, అర్జున్రావు, పద్మ, పద్మావతి పాల్గొన్నారు.


