టేకులపల్లి: కొత్తగూడెం జిల్లా స్థాయి ఇఫ్టూ రాజకీయ శిక్షణ తరగతులను ఈ నెల 10వ తేదీన ఇల్లెందులో నిర్వహిస్తున్నట్లు, కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర నాయకులు డి.ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం కోయగూడెం ఎల్ఎస్ఎన్ ఓబీ పరిధిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయనతో పాటు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి ఎన్.సంజీవ్ పాల్గొన్నారు. మాట్లాడుతూ జిల్లాలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఐఎఫ్టీయూ నిరంతరం పోరాడుతోందని కొనియాడారు. ఆవిర్భావం నుంచి ఎదురైన అనేక నిర్బంధాలను తట్టుకొని, కార్మికుల పక్షాన నిలబడి ఎన్నో విజయాలు సాధించిందని, కార్మిక శక్తి ముందు ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయన్నారు. జిల్లాలోని సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎల్ఎస్ఎన్ ఓబీ రెండు షిఫ్టుల కార్మికులు పాల్గొన్నారు.


