టేకులపల్లి: విధి నిర్వహణలో అంకితభావం కలిగిని బొమ్మనపల్లి ఆపరేషన్ సెక్షన్ లైన్మ్యాన్ బి.దేవ్సింగ్కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్లో నిర్వహించిన కంపెనీ స్థాయి కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగి అవార్డును ప్రదానం చేశారు. మూడేళ్లుగా 11 కేవీ ముత్యాలంపాడు ఫీడర్, 11 కేవీ మద్రాస్ తండా ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిర్వహణ బాధ్యతలను దేవ్సింగ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గాలి తుఫానులు, భారీ వర్షాలు కురిసినప్పుడు, చెట్లు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన ప్రతిసారీ, రాత్రింబవళ్లు శ్రమించారు. అనేక విపత్కర సందర్భాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ డీఈ, ఏడీఈ, ఏఈల సిఫార్సు మేరకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. లైన్మ్యాన్ దేవ్సింగ్కు విద్యుత్ అధికారులు, సహోద్యోగులు, స్థానికులు అభినందనలు తెలియజేశారు.


