పాల్వంచరూరల్: దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 15 వరకు ఉంటుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.పద్మ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. పాల్వంచ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగావకాశాలతో కూడిన ఏఈడీపీ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులకు డిగ్రీతోపాటు ఉద్యోగ అవకాశాలను అందించాలనే లక్ష్యంతో అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం(ఏఈడీపీ) కింద ప్రత్యేక కోర్సులు ఉన్నట్లు తెలిపారు. బీకాం విభాగంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ), సెన్స్ విభాగంలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో బీఎస్సీ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఏఈడీపీ విధానంలో విద్యార్థులు డిగ్రీ చదువుతోపాటు పరిశ్రమలు, సంస్థల్లో అప్రెంటిస్షిప్ శిక్షణ పొందుతారని, దీంతో ఉద్యోగ రంగానికి అవసరమైన నైపుణ్యం, వృత్తిపరమైన అనుభవం, కమ్యూనికేషన్, సామర్థ్యాలు పెంపొందించుకునే అవకాశం లభిస్తుందని వివరించారు. ఐదో సెమిస్టర్లో అప్రెంటిస్ సమయంలో విద్యార్థులకు నెలకు రూ.12 వేల చొప్పున ఆరు నెలల పాటు స్లయిఫండ్ ఇస్తారని, ప్రతిభ చూపిన విద్యార్థులకు సంబంధిత సంస్థల నుంచి ఆఫర్ లెటర్ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ
వేడుకలకు ముస్తాబు
రుద్రంపూర్: తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకలకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం ముస్తాబైంది. వేడుకలకు ముఖ్య అతిథిగా సింగరేణి సీఎండీ డాక్టర్ జ్యోతిబుద్ధప్రకాశ్ హాజరవుతున్న నేపథ్యంలో అన్ని సదుపాయాలు కల్పించారు. ఉత్తమ కార్మికుల సన్మానం, ఎస్అండ్పీసీ ఉద్యోగుల గౌరవ వందనం కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. సింగరేణి ప్రధాన కార్యాలయం, జీఎం కార్యాలయం, ఇతర కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
పీవీకే–5 ఇంక్లైన్
గని మేనేజర్ బదిలీ
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్ గని మేనేజర్ శ్యాంప్రసాద్ను కార్పొరేట్ ఏరియాలోని సీపీపీ విభాగానికి బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. శ్యాంప్రసాద్ 22 మాసాల క్రితం గని మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. కాగా, పీవీకే–5 ఇంక్లైన్ గని మేనేజర్గా వకీల్పల్లిలో పనిచేస్తున్న ఆర్.రవికిరన్ను నియమించారు. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.
గిన్నిస్ బుక్ రికార్డుల్లో మామిడిగూడెం వాసి
ఇల్లెందురూరల్: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మండలంలోని మామిడిగూడెంనకు చెందిన గుర్రం సుందర్రావుకు స్థానం దక్కింది. పరిశ్రమల శాఖలో జాయిట్ డైరెక్టర్గా ఉద్యోగ విరమణ చేసిన ఆయన పియానోపై నైపుణ్యం సాధించాడు. ఫిబ్రవరి 2న హైదరాబాద్లో 22 దేశాలకు చెందిన 2 వేల మందితో పియానో కీబోర్డు ప్రదర్శన ఇవ్వగా, 777 మంది గిన్నిస్ బుక్ రికార్డు కోసం అర్హత సాధించారు. వీరిలో సుందర్రావు కూడా ఉండగా, గత నెల 29న ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.
‘ర్యాపిడో’ను రద్దుచేయాలి
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో ర్యాపిడో వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఐఎన్టీయూసీ(ఆటో) జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్)లో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ర్యాపిడో వ్యవస్థ కారణంగా ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో డ్రైవర్లు వారి కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టతరంగా మారిందన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో చల్లంగి శ్రీనివాస్, గంగులు, సుధాకర్, మహమ్మద్ నూరు, శోభన్, సర్వయ్య, పాషా తదితరులున్నారు.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా విజయ్భాస్కర్
జూలూరుపాడు: ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా జూలూరుపాడుకు చెందిన పెండ్యాల విజయ్భాస్కర్ నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ చేతులమీదుగా ఆయన నియామకపత్రం అందుకున్నారు. విజయభాస్కర్ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్
ఇల్లెందురూరల్: ఇల్లెందు తహసీల్దార్గా ఎండీ.షాఖాసీం సోమవా రం బాధ్యతలు చేపట్టా రు. ఇప్పటివరకు తహసీల్దార్గా పనిచేసిన సూర్యనారాయణను కలెక్టరేట్కు బదిలీ చేశారు. కాగా, బదిలీపై వచ్చిన తొమ్మిది మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు సోమవారం విధుల్లో చేరారు. షాఖాసీం ఇంతకుముందు గుండాల తహసీల్దార్గా పనిచేశారు.


