● ఇదే కాసానికిచ్చే ఘన నివాళి ● సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
రుద్రంపూర్: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటామే కాసానికిచ్చే ఘనమైన నివాళి అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని సెవెన్హిల్స్ హోటల్ సమీపంలో, సుజాత నగర్లో ఏర్పాటు చేసిన కాసాని ఐలయ్య స్మారక స్తూపాలను ఆయన ఆవిష్కరించారు. తొలుత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కొత్తగూడెం నుంచి సుజాతనగర్ వరకు పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో బీవీ రాఘవులు మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు, దోపిడీ లేని సమాజం కోసం కాసాని తుదిశ్వాస వరకు పోరాడారని గుర్తుచేశారు. సుజాతనగర్ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. సుజాతనగర్ సర్పంచ్గా ఆదర్శపరిపాలన కొనసాగించారని తెలిపారు. కాసాని ఆశయాల సాధనకు పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాయిబాబు, పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, కొలగాని బ్రహ్మచారి, అన్నవరపు సత్యనారాయణ, కున్సోత్ ధర్మా, నర్సారెడ్డి, వీరహనుమంతరావు, వీర్ల రమేష్, గడ్డం స్వామి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


