సూపర్బజార్(కొత్తగూడెం): స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఏటీసీ కళాశాలల నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, అనుమతుల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పెండింగ్ ఫైళ్లను పరిష్కరించి పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సంబంధిత భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా సమగ్ర పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇల్లందు, అశ్వారావుపేటల తహసీల్దార్లు రవికుమార్, రామకృష్ణ , ఈ–సెక్షన్ సూపరింటెండెంట్ స్వర్ణలత పాల్గొన్నారు.
నేడు జిల్లావ్యాప్తంగా గ్రామసభలు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో సూచించారు. గ్రామ సభలను విజయవంతం చేయాలని కోరారు. సభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, నీడ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేసి ప్రజలకు వివరించాలని సూచించారు. సభలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, గురువారం నుంచి జిల్లాలో వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని వివరించారు.


