దమ్మపేట: దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకులంలో విద్యార్థుల భోజనంలో నాణ్యత లేకపోవడంతో బాధ్యులపై కలెక్టర్ అంకిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా అని ప్రశ్నించారు. బుధవారం మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్, పలు రెసిడెన్షియల్ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యత, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా ఆరా తీశారు. ముందుగా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేసి, దరఖాస్తుల పరిష్కారంపై తహసీల్దార్ రామనరేష్, అఽధికారులను నేరుగా ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. మీ సేవలో చెల్లించాల్సిన దరఖాస్తుల రుసుం వివరాలను కార్యాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. భూసమస్యలు, ధ్రువీకరణ పత్రాల విషయంలో ప్రజలు జిల్లా కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి వ్యయ ప్రయాసలు పడకుండా వాటిని స్థానికంగానే పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. మండల స్థాయిలోని పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దమ్మపేట గిరిజన గురుకులంలో మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం చికెన్, బగారా రైస్కు బదులుగా మిల్మేకర్ కూర, రైస్ వండటంపై బాధ్యులను ప్రశ్నించారు. కలెక్టర్ భోజనం తిని, ఆహార నాణ్యతను పరిశీలించారు. రుచి, నాణ్యతాలోపంతో పాటు పోషక విలువల లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కూడా పరిశీలించారు. ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి, తహసీల్దార్ రామనరేష్, ఎంఈఓ జగపతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట గిరిజన గురుకుల
అధికారులపై కలెక్టర్ అంకిత్ ఆగ్రహం


