
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
● ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
సూపర్బజార్(కొత్తగూడెం): గోదావరి నదికి వరదలొస్తే అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీఓసీలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారుల వాహనాల్లో లైఫ్ జాకెట్లు, టార్చిలైట్, తాడు, హ్యాండ్ మైక్ సిద్ధంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందస్తు ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల వారిని తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లైఫ్ జాకెట్లు, గజఈతగాళ్లు, నాటు పడవలు, బోట్లు సిద్ధంగా ఉంచాలని అన్నారు. రానున్న మూడు నెలల పాటు నిత్యావసర వస్తువులు నిల్వ ఉంచాలని డీఎస్ఓను ఆదేశించారు. వరద ముంపు చర్యల పర్యవేక్షణకు సెక్టోరియల్, జోనల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. అత్యవసరమైతే హెలీకాప్టర్ సేవలు ఉపయోగించుకునేలా హెలీప్యాడ్లు ఏర్పాటు చేయాలని, కిన్నెరసాని వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తే సమయంలో ప్రభావిత ప్రాంతాల వారికి ముందుగానే సమాచారం అందించాలని అన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసేలా ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని చెప్పారు. గర్భిణులు ఇబ్బంది పడకుండా ముందుగానే ఆస్పత్రుల్లో చేర్పించాలని, 108 వాహనాలు అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. పాము, తేలు కాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. సింగరేణి, కేటీపీఎస్, నవభారత్ తదితర సంస్థల రెస్క్యూ టీమ్ల సేవలు వినియోగించుకునేలా జాబితా సిద్ధం చేయాలని సూచించారు. భద్రాచలంలోని విస్తా కాంప్లెక్స్, అశోక్నగర్లో నీరు నిల్వకుండా ఎత్తిపోసేందుకు మోటార్లను అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గోదావరి వరద 73 అడుగుల మేర వచ్చినా ఎదుర్కొనేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ ఽగిరిజనులు పలు కీలక సేవలు పొందేందుకు 15 రోజుల పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ రోహిత్రాజు, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు, ఏఎస్పీ విక్రాంత్సింగ్ పాల్గొన్నారు.
రెండు రోజుల్లో 1,13,398 మందికి రైతు భరోసా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా సోమ, మంగళవారాల్లో కలిపి 1,13,398 మంది రైతుల ఖాతాల్లో రూ.102,10,83,683 జమయ్యాయని కలెక్టర్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. గత యాసంగిలో పట్టాదారులు 1,78,545 మంది ఉండగా ప్రస్తుతం కొత్తగా 1,023 మంది పట్టాలు పొందారని, అలాగే గత సీజన్లో బ్యాంకు వివరాలు సరిగా లేనివారు, నమోదు చేయని వారు కలిపి 1,382 మంది ఉన్నారని పేర్కొన్నారు. వానాకాలానికి సంబంధించి 1,79,535 మంది లబ్ధిదారుల వివరాలను పోర్టల్లో నమోదు చేశామని తెలిపారు. నూతనంగా పట్టాలు పొందిన రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ను ఏఈఓలకు అందించి రైతు భరోసా పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఒలింపిక్ డే రన్ టీషర్టుల ఆవిష్కరణ
ఈనెల 23న అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన టీ షర్టులను కలెక్టర్ పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడల్లో దేశం తరఫున పాల్గొని పతకాలు సాధించడమే లక్ష్యంగా క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ ఎస్కె సాబీర్పాషా మాట్లాడుతూ ఈ రన్ను పాల్వంచలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రారంభిస్తారని తెలి పారు. 19న అశ్వారావుపేట, 20న భద్రాచలం, 21న మణుగూరు, 22న ఇల్లెందులో కొనసాగుతూ 23న కొత్తగూడెంలో ముగుస్తుందని వివరించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ ఎం. పరంధామరెడ్డి, అసోసియేషన్ బాధ్యులు వై.వెంకటేశ్వర్లు, కె.మహీధర్, మాస్టర్స్ అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ మంజులాల్, కార్యదర్శి నాగలక్ష్మి, ఎస్జీఎఫ్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్, అంతర్జాతీయ క్రీడాకారిణి సింధు తపస్వి పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో కార్పొరేట్ వసతులు
పాల్వంచ: అంగన్వాడీ కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ పాటిల్ తెలిపారు. పాత పాల్వంచ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రంలో ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో విద్యార్థులకు ఆయన పలకలు, పుస్తకాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుద్దీకరణ, తాగునీరు, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని, అనుభవజ్ఞులైన టీచర్లను నియమించామని చెప్పారు. చిన్నారులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించి ఆర్థిక భారం పెంచుకోవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారిణి స్వర్ణలత లెనినా, మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.