
పత్తి రైతుపై విత్తన భారం
● అందని ప్రభుత్వ సబ్సిడీ ● అయినా సాగుకు రైతుల మొగ్గు ● జిల్లాలో ఈ ఏడాది రెండు లక్షల ఎకరాలు దాటే అవకాశం
పాల్వంచరూరల్ : ప్రతీ సంవత్సరం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి. ఆరుగాలం శ్రమించినా పంటలకు సరైన ధర రాక నష్టపోతున్నారు. కొన్ని రకాల విత్తనాలకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతున్నా.. పత్తి, వరికి మాత్రం ఎలాంటి రాయితీలు రావడం లేదు. ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సి రావడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. దీనికి తోడు గతేడాది 450 గ్రాముల పత్తి ప్యాకెట్ ధర రూ. 856 ఉండగా, ఈ సంవత్సరం రూ.45 పెరిగి రూ.901కి చేరింది.
ఈ ఏడాది పెరగనున్న సాగు..
జిల్లాలో గత సంవత్సరం 1.85 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా.. ఈసారి రెండు లక్షల ఎకరాలకు పైగా సాగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎకరానికి రెండు నుంచి మూడు ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయి. కాగా, కొందరు డీలర్లు నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి వస్తాయి అని చెబుతూ అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లతో పాటు దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్లు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఈ ఏడాది ఎక్కువ మంది పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు.
అదును లేకున్నా విత్తనాలు..
జిల్లాలో ప్రస్తుతం ఆశించిన మేర వర్షాలు కురవలేదు. అయితే విత్తనాల సాగుకు అదును లేకున్నా కొందరు రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. పొడిదుక్కుల్లో విత్తొద్దని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా పలువురు పెడచెవిన పెడుతున్నారు. మృగశిర కార్తె ప్రారంభమైతే వర్షాలు కురుస్తాయని, ముందుగానే దిగుబడి వస్తే అధిక ధర దక్కుతుందనే ఆశతో విత్తనాలు వేసిన రైతులు.. ఇప్పటికీ ఎండలు దంచికొడుతుండడంతో మొలకలు రాక, వచ్చినవీ ఎండిపోతుండడంతో తల పట్టుకుంటున్నారు. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం తప్పదని ఆందోళన చెందుతున్నారు.